కేంద్రానికి యువత తెలియజేయాలి..

 

ఏపీ ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన గళం విప్పారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ట్విట్టర్ ద్వారా తెలిపారు. తిడితే భరించాం.. విడగొట్టి నెట్టేస్తే సహించాం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తిరగబడతాం అన్నది ఆంధ్ర యువత కేంద్రానికి తెలియజెప్పాలి అంటూ ట్వీట్స్ చేశాడు. అంతేకాదు ఈ నెల 26న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో మౌన నిరసన ప్రదర్శన చేస్తే తమ పార్టీ మద్దతు ఉంటుందని అన్నారు. కాగా గణతంత్ర దినోత్సవాన నిరసన ప్రదర్శనలు చేపడుతున్నామంటూ.. ప్రత్యేక హోదా..ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్లు..అనే నినాదంతో కూడిన సందేశాలు ట్విట్టర్‌లో ‘స్టూడెంట్స్‌ ఫర్‌ స్పెషల్‌స్టేటస్‌’ పేరుతో వస్తున్నాయి. జల్లికట్టు కోసం తమిళులు చేసినట్లు ఈ నెల 26న విశాఖలోని ఆర్కే బీచ్‌లో, విజయవాడలో బ్యారేజీ దిగువన, తిరుపతిలో ఎస్వీ విశ్వవిద్యాలయంలో నిరసన కార్యక్రమాలుంటాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మొదలవ్వడంతో దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ పైవిధంగా ట్వీట్స్ చేశారు. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి రేగుతుంది.