వచ్చే ఎన్నికల్లో వైసీపీకి జనసేన మద్దతు.. ఇది ఫిక్స్
Published on: Fri Jun 22, 2018 4:57PM

గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన జనసేన, తర్వాత టీడీపీని విభేదించి వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోరుకు సిద్ధమైంది.. టీడీపీ మీద విమర్శలు చేస్తుంది.. అయితే వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయని టీడీపీ ఆరోపణలు చేస్తుంది.. తాజాగా వైసీపీ నేత మాజీ ఎంపీ వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.. వచ్చే ఎన్నికల్లో పవన్, వైసీపీకి మద్దతిస్తారని చెప్పిన వరప్రసాద్, ఈ విషయాన్నీ తనకి స్వయంగా పవనే చెప్పారని బాంబు పేల్చారు..
'చంద్రబాబు అనుభవం కలిగిన వ్యక్తి, అవినీతి చేయరన్న ఉద్దేశంతో 2014 ఎన్నికల్లో మద్దతిచ్చాను.. కానీ ఈ నాలుగేళ్లలో అవినీతి పెరిగిపోయింది, ప్రత్యేకహోదా కూడా సాధించలేదు.. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుకి మద్దతు తెలపనని' పవన్ అన్నట్టు వరప్రసాద్ తెలిపారు.. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో మద్దతంటూ ఇస్తే జగన్ కే ఇస్తానని పవన్ స్పష్టం చేసినట్టు వరప్రసాద్ చెప్పారు.. పవన్ అభిప్రాయం పట్ల తాను హర్షం వ్యక్తం చేసానని, ఇదంతా వాస్తవమని వరప్రసాద్ స్పష్టం చేసారు.. సాక్ష్యాత్తు వైసీపీ నేత వరప్రసాదే మాకు వచ్చే ఎన్నికల్లో పవన్ మద్దతిస్తాడని చెప్పడంతో..
ఇన్నిరోజులు టీడీపీ చేస్తున్న ఆరోపణలు నిజమని తేలిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.. మరి ఒంటరిగా పోరుకి సిద్ధమన్న పవన్, వచ్చే ఎన్నికల్లో నిజంగా వైసీపీతో జత కడతాడా? లేక ఒంటరిగా తన అదృష్టాన్ని పరీక్షించుకొని, ఫలితాల తరువాత పొత్తుల గురించి ఆలోచిస్తాడా? లేదు ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అన్నాడు కాబట్టి ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా ప్రశ్నిస్తూ ఉంటాడా? అమ్మో ఇన్ని ప్రశ్నలా!! వీటన్నింటికి సమాధానం తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.. చూద్దాం ఏం జరుగుతుందో.


