ఎగ్జిట్ పోల్స్ తప్పు.. ఏపీలో హంగ్, పవన్ కల్యాణే కింగ్ మేకర్

 

ఏపీలో ఏ పార్టీకి విజయం చేకూరనుందో రేపు అధికారికంగా తేలనుంది. అప్పటివరకు మిగిలిన ఈ కొద్ది గంటలు ఎవరి అంచనాలు వారివి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. మెజారిటీ సంస్థలు ఏపీలో వైసీపీదే అధికారమని అంచనా వేశాయి. ఒకటి రెండు సంస్థలు మాత్రం టీడీపీ అధికారం నిలబెట్టుకుంటుందని అంటున్నాయి. ఇక ఎంతోకొంత ప్రభావం చూపుతుందనుకున్న జనసేన రెండు మూడు సీట్లకు మించి గెలిచే అవకాశం లేదని దాదాపు అన్ని సర్వేలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ ఎగ్జిట్ పోల్స్ వైసీపీలో ఆనందాన్ని, టీడీపీలో భయాన్ని, జనసేనలో నిరాశని మిగిల్చాయి. అయితే జ్యోతిష్య పండితులు మాత్రం ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తప్పు అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినట్లు జనసేన మరీ అంత వీక్‌గా ఏమీ లేదట. గ్రహాలు వాటి మూమెంట్ ని బట్టి చూస్తుంటే.. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా జనసేన మద్దతు తప్పనిసరి అంటున్నారు జ్యోతిష్య పండితులు.

అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని.. అవి పూర్తిగా అబద్ధాలు చెబుతున్నాయని జ్యోతిష్య శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించిన శైలేంద్ర శర్మ అంటున్నారు. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఎన్నికలు జరిగిన 7 దశలనూ పరిశీలిస్తే.. గ్రహాలు ఏ పార్టీకీ అనుకూలంగా లేవని ఆయన అంటున్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎవరైనా సరే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేరని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ప్రధాని అయ్యే భాగ్యం లేదట. ఎన్డీయే పక్షాలన్నీ కలిసినా మేజిక్ ఫిగర్ రాదట. కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. జ్యోతిష్య పండితులు మాత్రం అటు కేంద్రంలోనూ, ఇటు ఏపీలోనూ హంగ్ తప్పదు అంటున్నారు. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయో మరి కొద్ది గంటల్లో తెలుసుకుందాం.