వైకాపా ఫ్యాక్షన్‌ పార్టీ - పవన్

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పవన్‌ బుధవారం కార్యకర్తలతో, ఆక్వా ట్రేడర్లతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు.పైరవీకారులు, దోపిడీదారులు అధికారంలో కూర్చొంటే సామాన్యుడికి న్యాయం జరగదని, బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మూడో ప్రత్యామ్నాయం అవసరమని, అందుకే జనసేన పార్టీ పెట్టానని పేర్కొన్నారు.వేల కోట్లు దోచేసి జైలులో కూర్చొని వచ్చిన వాళ్లు కూడా నీతులు చెబుతున్నారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

 

 

తాను 25 ఏళ్లు కష్టపడి ఒక స్థాయికి వచ్చి రూ.25 కోట్ల పన్ను కడితే జగన్‌ మాత్రం రెండు మూడేళ్లలో రూ.300 కోట్ల పన్ను ఎలా కట్టగలిగారో అర్థం కావడం లేదన్నారు. వైకాపాలాంటి ఫ్యాక్షన్‌ పార్టీలను ఎదుర్కోడానికి కత్తులు, బాంబులు లేకపోవచ్చని కానీ ఆ పార్టీ గూండాలను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం జనసైనికులకు ఉందని పవన్‌ అన్నారు. గూండాలు, ఫ్యాక్టనిస్టులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తామని, అలాంటి పోరాటమే కావాలనుకుంటే తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ‘‘నేను విలువలతో కూడిన రాజకీయం చేయడానికి వచ్చా. ఎలాంటి భాష ఉపయోగించాలో తెలిసినవాడిని. నేను వ్యక్తిగతంగా మాట్లాడడం మొదలు పెడితే ఫ్యాక్షనిస్టు నాయకులు ఊహించలేరు. తట్టుకోలేరు. పారిపోతారు. అయితే అలాంటి మాటలతో సమస్యలు పరిష్కారం కావు. ఇసుక మాఫియా, కుంభకోణాలు, దోపిడీలు చేసే వీళ్లకే పిచ్చిపిచ్చిగా మాట్లాడే తెగింపు ఉంటే ప్రజాసంక్షేమం కోసం నిలబడే నాకు ఎంత తెగింపు ఉండాలి? చూడ్డానికే పవన్‌ కల్యాణ్‌ మెత్తగా కనిపిస్తాడు. తేడా వస్తే తోలు తీస్తాడు. సమాజంలో మార్పు తీసుకొస్తాననే భయంతోనే తెలుగుదేశం, వైకాపా, భాజపా నేతలు అందరూ నన్ను తిడుతున్నారు. పవన్‌ ఒంటిస్తంభం మేడమీద కూర్చొనే వ్యక్తి కాదు. నేలమీద నడిచే వ్యక్తి అని గుర్తుంచుకోవాలి’’ అని అన్నారు.పవన్‌ కల్యాణ్‌ కులాన్ని నమ్ముకున్న నాయకుడని చంద్రబాబు అనడం బాధ కల్గించిందని పవన్‌ అన్నారు. నిజంగా తాను కులాన్నే నమ్ముకుంటే 2014లో తెదేపాకు ఎందుకు మద్దతు పలుకుతానని ప్రశ్నించారు.రాష్ట్ర ఖజానాకు ధర్మకర్తగా ఉండాల్సిన ముఖ్యమంత్రి విలాసాల కోసం కోట్ల రూపాయలు తగలేస్తున్నారని మండిపడ్డారు.