భీమవరం నుంచే జనసేనాని పోటీ!

posted on: Jul 15, 2022 4:57PM

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నది సామెత. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా అదే సామెతను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికలలో ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం,  విశాఖ జిల్లా గాజువాకల నుంచి అసెంబ్లీ బరిలోకి దిగారు. అయితే రెండు చోట్లా ఆయన పరాజయం పాలయ్యారు. దీంతో ఈ సారి ఆయన తిరుపతి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని వార్తలు వచ్చాయి. పలు సందర్భాలలో జనసేని వర్గాలు  ఆ విషయాన్ని దాదాపు ఖరారు చేసినట్లే మాట్లాడారు. కానీ తాజా సమాచారం మేరకు వచ్చే ఎన్నికలలో ఆయన మళ్లీ భీమవరం నియోజకవర్గం నుంచే బరిలోకి దిగనున్నారు. 2014 ఎన్నికలలో జనసేన బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చి ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంది.

అయితే 2019 ఎన్నికలలో మాత్రం బీజేపీ, తెలుగుదేశం పార్టీలతో పొత్తును, మైత్రిని కటీఫ్ చేసుకుని ఒంటరిగా బరిలోకి దిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీలో నిలిచారు.  అయితే ఆ ఎన్నికలలో జనసేనకు ఘోర పరాజయం ఎదురైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పరాజయం పాలయ్యారు. జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించగా, పోటీ చేసిన మిగిలిన అన్ని స్థానాలలోనూ పరాజయం పాలైంది. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ ఏ పార్టతో పొత్తు పెట్టుకుంటుందన్నది ఖరారు కాలేదు.

అయితే జనసేన మాత్రం ఈ సారి ఎన్నికలలో విజయంపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కచ్చితంగా విజయం సాధించాలన్న లక్ష్యంగా పవన్ కల్యాణ్ సురక్షిత స్థానం కోసం చేసిన అన్వేషణలో తిరుపతి నుంచి అయితే బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చినట్లు ఇప్పటి వరకూ పార్టీ శ్రేణులు చెబుతూ వచ్చాయి.

అయితే అవన్నీ ఊహాగానాలేననీ, పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలలో భీమవరం నుంచే పోటీ చేస్తారనీ జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు గోవిందరావు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 17న పవన్ కల్యాణ్ భీమవరంలో పర్యటించనున్నారు. ఆ పర్యటనలోనే పవన్ కల్యాణ్ భీమవరం నుంచే తన పోటీ అని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని  జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...