కలసి ఉంటే కలదు కూటమి!
Published on: Sat Mar 7, 2026 9:01AM

ఇటీవల కిరణ్ రాయల్ వంటి కొందరు పవన్ లేకుంటే తెలుగుదేశం గెలిచే ఛాన్సే లేదని కామెంట్ చేయడం కూటమి వర్గాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. తెలుగుదేశం, జనసేన పార్టీల సోషల్ మీడియాలో ఒక రకంగా డైలాగ్ వార్.. మాటల యుద్ధం జరిగింది. అంతే కాకుండా కిరణ్ రాయల్ వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు. వైసీపీ వారు కేవలం 11 మందే ఉన్నా.. వారు 1100 మంది ఉన్నట్టు బిల్డప్ ఇస్తారనీ, కల్తీ వాళ్లే చేస్తారు, బూతులు వాళ్లే మాట్లాడతారు, మనమేదైనా ఆన్సర్ ఇస్తే దాన్ని కూడా బదనాం చేస్తారు.. అదే మనం మనం చేసిన పని చెప్పుకోలేక పోవడం చేటు తెస్తోందని అసెంబ్లీ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
అదే సమయంలో గత విధ్వంస పాలనకు ప్రస్తుత పాలనకూ ఎంతో తేడా ఉందనీ, ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో రవీంద్రుడి వచనాలను జోడించి ఎంతో గొప్పగా వినిపించారనీ, ఆయన కూటమి పాలనలో తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని కూడా ఎంతో చక్కగా పాంప్లెంట్లు వేసి మరీ వివరించి చెబుతున్నారనీ పయ్యావుల పనితీరును ప్రసంగించారు. వాళ్లు కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి పోయినా, ఇక్కడ మనం ఇంత చేస్తున్నామన్న పవన్ కల్యాణ్ ఈ సమయంలో మన ముఖ్యమంత్రికి మనమంతా అండగా నిలవాల్సిన అవసరముందన్నారు.
దీంతో బయట కిరణ్ రాయల్ వంటి బాధ్యతలేని కార్యకర్తల ద్వారా ఏర్పడ్డ అగాథాలను పవన్ కల్యాణ్ ఈ ఒక్క మాటతో పూడ్చే యత్నం చేశారు. ఎవరెన్ని యత్నాలు చేసినా, ఇక్కడ కూటమి ని ఎవరూ విడదీయలేరనీ.. పైపెచ్చు బయట ఎంతగా వైసీపీ విజృంభిస్తోంటే.. మన ఐక్యత అంతగా బలపడాలని తన శ్రేణులతో పాటు కూటమి శ్రేణులకు కూడా అసెంబ్లీ నుంచి ఒక సందేశం ఇచ్చారు పవన్ కల్యాణ్


