ముసుగులో స‌ర్దుబాట్లు.. పవన్ చివాట్లు

 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి సంబంధించిన పత్రికలో 'ముసుగులో స‌ర్దుబాట్లు' అంటూ ఒక క‌థ‌నం ప్రచురితమైన విషయం తెలిసిందే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య డీల్ కుదిరిందని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని రాసుకొచ్చారు. అంతేనా.. చంద్రబాబు, పవన్ రహస్యంగా భేటీ అయ్యారని.. సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయిందని.. జనసేనకు 25 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించిందని.. అబ్బో ఇలా చాలా రాసారు. ఇంకేముంది టీడీపీ జనసేన పొత్తు అంటూ రాజకీయవర్గాల్లో చర్చలు కూడా మొదలయ్యాయి. అయితే ఈ వార్తలపై తాజాగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.‘జనసేన.. వైసీపీ-బీజేపీలకు భాగస్వామిగా ఉందని టీడీపీ చెబుతోంది. ఇప్పుడు టీడీపీతో మేం కలిసిపోయామని వైసీపీ చెబుతోంది. నేను రాజ్ భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కాగానే.. నేను టీఆర్ఎస్-వైసీపీ మనిషినని టీడీపీ ఆరోపిస్తుంది. మనం నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు అన్ని పక్షాల నుంచి విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది’ అని ట్వీట్ చేశారు. ముందు ముందు ఇలాంటి కథనాలు ఇంకా రావొచ్చని వాటిని నమ్మొద్దని కోరారు.