ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం సరైనదే: పవన్

 

ప్రజావేదిక కూల్చివేతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆయన వ్యాఖ్యానించారు.

గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పవన్‌ బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు లింగమనేని పూర్ణభాస్కరరావు, కుటుంబ సభ్యులు పవన్‌కు స్వాగతం పలికారు. ఆలయంలో నిర్వహించిన 108 కలశాల పూజలో పవన్‌ తో పాటు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. ప్రజావేదిక కూల్చివేతపై స్పందించారు. ప్రజావేదికతో సరిపెట్టకుండా అనుమతిలేని మిగతా భవనాలను కూడా కూల్చివేయాలన్నారు. అనుమతిలేని అన్ని భవనాలను కూలిస్తేనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు సరైనవేనని పవన్ వ్యాఖ్యానించారు.