రాజోలు వెళ్లి పోరాడతానంటున్న పవన్!
posted on Aug 13, 2019 3:27PM
జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను కొద్ది సేపటి క్రితంపోలీసులు అరెస్ట్ చేసారు. రాపాక స్వయంగా రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఎమ్మెల్యే, అయన అనుచరులు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి అద్దాలు పగులకొట్టారని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా దీని పై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పోలీసులు గోటి తో పోయేదానికి గొడ్డలి దాక తీసుకు వచ్చారని అయన అన్నారు. ప్రజల తరుఫున పొలిసు స్టేషన్ కి వెళ్లిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను అరెస్ట్ చేయడం సరి కాదని జనసేనాని అభిప్రాయపడ్డారు. ఇదే ప్రభుత్వం నెల్లూరు లో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి జర్నలిస్ట్ పై దాడికి ప్రయత్నిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని అయన మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే తాను రాజోలు వెళ్లి పోరాడతానని పవన్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.