కేసీఆర్ కి పవన్ సూచన... కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు
Published on: Mon Oct 7, 2019 3:49PM

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సమ్మెను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని పవన్ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. డిమాండ్ల సాధనకు ఉద్యోగులు చేసే ఆందోళనలను సానుభూతితో పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆయన సూచించారు. సకల జనుల సమ్మెలో భాగంగా 17 రోజుల పాటు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్నారని పవన్ గుర్తుచేశారు. ప్రస్తుతం అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పవన్ వ్యాఖ్యానించారు.


