సీబీఐ దత్తపుత్రుడు జగన్.. వైసీపీ చర్లపల్లి జైలు షటిల్ టీమ్.. పవన్ ఫైర్..
Published on: Tue Apr 12, 2022 6:11PM
16 నెలలు జైల్లో ఉన్న జగన్, ఆయన బృందం తనకు నీతులు చెప్పడం దారుణమని జనసేనాని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ఇంకోసారి తనను సీబీఎన్ దత్తపుత్రుడు అంటే.. జగన్ను సీబీఐ దత్తపుత్రుడు అంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జనసేనను టీడీపీ బీ-టీమ్ అంటే.. వైసీపీని చర్లపల్లి షటిల్ టీమ్ అంటామని హెచ్చరించారు. ఆ మేరకు జనసేన నాయకులకు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు పవన్ కల్యాణ్.
"మేం ప్రజల పక్షాన పాలసీలపై మాట్లాడుతుంటే.. వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మీరు తిట్టే భాషకంటే ఇంకా మంచి భాష నాకూ వచ్చు. కానీ, ఇలాంటి భాష రాజకీయాలకు వాడి ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించడం నాకిష్టం లేదు. మేం పాలసీలపై మాట్లాడుతున్నప్పుడు మీరు.. సీబీఎన్కు దత్తపుత్రుడు అంటే మేం సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది. జనసేన నాయకులు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ చెబుతున్నా.. ఈసారి వైసీపీ వ్యక్తులు సీబీఎన్ దత్తపుత్రుడు అంటే జగన్ సీబీఐ దత్తపుత్రుడు అని గట్టిగా చెప్పండి" అని సూచించారు.
"వైసీపీలోని ముఖ్య నాయకులు చాలా మందిని సీబీఐ కోర్టు దత్తత తీసుకుంటుంది. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి జనసేనను టీడీపీ బీ టీమ్ అంటున్నారు. ఏదైనా అంటే ఏడుస్తారని భరిస్తూ వచ్చా.. నాక్కూడా సహనం పోయింది. ఈసారి గనుక మమ్మల్ని టీడీపీ బీ టీమ్ అంటే.. మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్ టీమ్ అనాల్సి వస్తుంది. ఎందుకంటే.. చర్లపల్లి జైల్లో చక్కగా 16 నెలలు షటిల్ ఆడుకున్నారు. మీరేదో దేశ సేవ చేయలేదు. వల్లభాయ్ పటేల్ కాదు.. సుభాష్ చంద్రబోస్లు కాదు మీరు.. ఆర్థిక నేరాలు చేసి జైల్లో కూర్చున్నారు. మీరు మాకు నీతులు చెప్పొద్దు. మమ్మల్ని విమర్శించే హక్కు.. ఆ స్థాయి కూడా మీకు లేదు" అని పవన్ కల్యాణ్ ఫుల్ ఫైర్ అయ్యారు.


