రాష్ట్ర విభజనకు చిరంజీవి కారణం కాదన్న పవన్ కళ్యాణ్

 

రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం జగన్ అని పవన్ కళ్యాణ్ తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఎలుగెత్తి చాటాడు. కేసీఆర్ సీమాంధ్రులను నోటికొచ్చినట్టల్లా తిడుతుంటే జగన్ నోరు మెదపకుండా ఊరుకున్నారని అన్నాడు. జగన్‌లో సీమాంధ్ర పౌరుషం చచ్చిపోయిందా అని గట్టిగా ప్రశ్నించాడు. దాంతో జగన్ మీడియా పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేక కథనాలు వెలుగులోకి తెచ్చింది. రాష్ట్ర విభజనకు కేంద్రమంత్రి చిరంజీవి కూడా కారకుడేనని, మరి చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శించడం లేదన్నది ఆ కథనాల సారాంశం. దీనికి గురువారం నాడు పవన్ కళ్యాణ్ ప్రతిస్పందించాడు. రాష్ట్ర విభజనకు చిరంజీవి కారణం కానేకాదని, అందువల్లే చిరంజీవి మీద తాను విమర్శలు చేయడం లేదని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీలో వున్నప్పటికీ అన్నయ్య చిరంజీవి మీద తనకు ఎంతో గౌరవం వుందని పవన్ కళ్యాణ్ చెబుతూ, రాష్ట్ర విభజనకు ప్రధాన కారకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అని అన్నారు. వీరిద్దరికి మరో ఇద్దరు జగన్, కేసీఆర్ సహకరించారని చెప్పారు. అసలు కేసీఆర్‌తో జగన్‌కి వున్న సంబంధ బాంధవ్యాలేంటో బయటపెట్టాలని పవన్ అన్నారు.