మీడియాకి హ్యండిచ్చిన మెగా బ్రదర్స్

 

 

వేలిస్తే చెయ్యందుకొనే మన మీడియా రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్, నాగబాబు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయని చెపుతూనే, దానిపై ఎవరి శక్తిమేర వారు ఊహాగానాలు, సందర్భ సహిత వ్యాఖ్యలు, విశ్లేషణలు వగైరా వగైరాలతో జనాలను, ముఖ్యంగా తెదేపా అభిమానులను మంచి రంజింపజేశారు. కొందరు మరొక అడుగు ముందుకు వేసి, యన్టీఆర్ కి చెక్ పెట్టేందుకే పవన్ కళ్యాణ్ పార్టీలోకి రప్పిస్తున్నారని ఈ వార్తలకి మంచి మసాలా కూడా తగిలించారు. పనిలోపనిగా నాగబాబుకి మచిలీపట్నం నుండి టికెట్ కూడా వాళ్ళే కన్ఫర్మ్ చేసేసి తమ సత్తా చాటుకొన్నారు. మరొక వారం పదిరోజులు ఆగితే పవన్ కళ్యాణ్ కి కూడా టికెట్ ఖాయం చేసేసేవారే, కానీ నాగబాబు తొందరపడి తాము ఏ పార్టీలో చేరడంలేదని ఈ రోజు ప్రకటించేశాడు. మీడియా ప్రజారాజ్యానికి కూడా తిరిగి ప్రాణం పోయాలని ఆశపడింది కానీ ఆ ప్రయత్నం పైనా నాగబాబు నీళ్ళుజల్లి అందరినీ ఉసూరుమనిపించాడు. అయితే ఇక మెగా సోదరులిద్దరూ రాజకీయాలలో చెయ్యి కాల్చుకొనే ఆలోచనలో లేరనే సంగతి మాత్రం ఖరారయిపోయింది.