TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వసంత పంచమి నాడు పుణ్యస్నానాలు.. భక్తులకు అఖాడా పరిషత్ విజ్ణప్తి

Published on: Wed Jan 29, 2025 8:44AM

కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాల కోసం వచ్చి భక్తులు మృత్యువాత పడటం దురదృష్టకరమన్నారు. త్రివేణి సంగమం వైపు వెళ్ల వద్దని ఆయన భక్తులకు విజ్ణప్తి చేశారు. భక్తులు పుణ్యస్నానం కోసం గంగాఘట్ వద్దకు రావాలని పిలుపు నిచ్చారు. మహా విషాదం సంభవించిందని పేర్కొన్న యోగి.. ఈ సమయంలో భక్తులు సంయమనంతో వ్యవహరించాలని, అధికారుల సూచనలను తు.చ. తప్పకుండా పాటించాలని కోరారు.

బుధవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. ఈ కారణఏంగా మొత్తం 13 అఖాడాల్లో పవిత్ర అమృత స్నాన్ రద్దు చేస్తూ అఖిల భారతీయ అఖాడా  పరిషత్ నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య పురస్కరించుకుని భక్తులు అంచనాలకు మించి పుణ్యస్నానాల కోసం వచ్చారని పేర్కొన్న అఖిల భారత అఖాడా  పరిషత్  అధ్యక్షుడు రవీంద్ర పురి.. ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాట బాధాకరమన్నారు.

 అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు ఈ రోజుకు బదులు వసంత పంచమికి రావాలని ఆయన  భక్తులను కోరారు.  ఫిబ్రవరి 2వ తేదీని వసంత పంచమి సందర్భంగా పుణ్యస్నానమాచరించేందుకు రావాలని ఆయన కోరారు. ఇలా ఉండగా కుంభమేళాలో తొక్కిసలాట, అనంతర పరిస్థితిని ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. సమీక్షిస్తున్నారు. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.  సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పలుమార్లు ఫోన్ లో మాట్లాడారు. అవసరమైన ఆదేశాలు ఇస్తూ పరిస్థితి సాధారణ స్థితికి చేరే వరకూ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పని చేయాలని ఆదేశించారు.