TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాస్టర్‌ అభినయ్‌పై దాడి పూర్తి కల్పితం.. 8 మందిపై కేసులు : ఎస్పీ

Published on: Wed May 20, 2026 9:28PM

 

అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాస్టర్‌ అభినయ్‌ దర్శన్‌పై జరిగినట్లు ప్రచారంలోకి వచ్చిన దాడి ఘటన పూర్తిగా కల్పితమని ఎస్పీ అమిత్‌ బర్దార్‌ స్పష్టం చేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన పాస్టర్‌ సహా 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.  సమాజంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఈ విధమైన తప్పుడు ప్రచారానికి తెరలేపినట్లు విచారణలో తేలిందని ఎస్పీ వెల్లడించారు. ఈ మేరకు కల్పిత దాడి నాటకంలో భాగస్వాములైన పాస్టర్‌తో సహా మొత్తం ఎనిమిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

అసలేం జరిగిందంటే.. కడప జిల్లాకు చెందిన పాస్టర్ అభినయ్ దర్శన్ (భరోసా రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు, సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నాయకుడు) అల్లూరి జిల్లా చింతపల్లి మండలం నిరుతోటపాలెం పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ఆయనపై గుడ్లు విసిరి, పదునైన ఆయుధాలతో దాడి చేశారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తీవ్ర గాయాలపాలైన పాస్టర్‌ను జెర్రెలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొందని ప్రచారం జరిగింది. 

 మన్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ స్వయంగా పర్యవేక్షించిన ఈ విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. ప్రజాదరణ లేదా ఇతర ప్రయోజనాల కోసం ఈ దాడిని వారే స్వయంగా ప్లాన్ చేసి, కల్పిత వీడియోలను సృష్టించినట్లు పోలీసులు నిర్ధారించారు.ఎనిమిది మందిపై కేసులు నమోదు: శాంతిభద్రతలకు భంగం కలిగించడం, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నడం వంటి తీవ్రమైన అభియోగాల కింద పోలీసులు ఎనిమిది మందిని నిందితులుగా చేరుస్తూ కేసులు నమోదు చేశారు. 

వారి వివరాలు :A1: పాస్టర్‌ అభినయ్‌ దర్శన్‌ A2: బిల్లా కిరణ్‌ A3: కె. బెన్హర్‌ A4: భానుప్రసాద్‌వీరితో పాటు ఈ కల్పిత దాడి ప్రణాళికకు, వీడియోల సృష్టికి సహకరించిన వసంతకుమార్‌, ప్రేమ్‌కుమార్‌, సత్యరాజు, ఇంద్రకుమార్‌లపై కూడా కేసులు పెట్టినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. అంతేకాకుండా, నిందితుడైన పాస్టర్ అభినయ్‌పై గతంలోనే వరకట్న వేధింపులతో పాటు ఒక యువతిని వేధించిన కేసులు కూడా ఉన్నట్లు ఎస్పీ అమిత్ బర్దార్ మీడియాకు వివరించారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ఉద్రేకపూరితమైన, నిజానిజాలు తెలియని తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు ఎవరూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని, బాధ్యతారాహిత్యంగా పోస్టులు షేర్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ శాఖ హెచ్చరించింది