TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హత్య కాదు.. రోడ్డు ప్రమాదమే.. పాస్టర్ ప్రవీణ్ మరణంపై పోలీసులు

Published on: Sat Apr 12, 2025 12:50PM

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై వివాదానికి పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలోనే మరణించారని తేల్చేశారు. ఈ మేరకు ఏలూరు రేంజి ఐజీ శనివారం ఈ విషయాన్ని విస్పష్టంగా చెప్పారు. శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన  పాస్టర్  ప్రవీణ్ పగడాలది ఎంత మాత్రం హత్య కాదనీ, ఆయన రోడ్డు ప్రమాదంలోనే మరణించారనీ, సీసీ ఫుటేజీల ఆధారాలతో సహా తెలిపారు. అతిగా మద్యం సేవించి… ఆ మత్తులోనే వేగంగా వాహనాన్ని నడుపుతున్న క్రమంలో ప్రవీణ్ మూడు సార్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, చివరిగా నాలుగో సారి కంకరరోడ్డుపై బైక్ స్కిడ్ అయి పడి మరణించారని చెప్పారు.  

ఈ విషయంలో ఇప్పటిదాకా   ప్రవీణ్ మరణాన్ని వివాదాస్పదం చేసేలా ప్రకటనలు చేసిన వారితో పాటుగా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి నోటీసులు జారీ చేసినట్లు కూడా తెలిపారు పాస్టర్ ప్రవీణ్ పగడాలని హీత్య అన్న వార్తల్లో ఇసుమంతైనా వాస్తవం లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  హత్య చేశారన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

అంతే కాకుండా ప్రవీణ్ పగడాల మృతికి దారి తీసిన అన్ని పరిస్థితులను సాక్ష్యాలతో సహా వివరించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి బైక్ పై బయలుదేరిన ప్రవీణ్ పగడాల తన ప్రయాణ విషయాన్ని కుటుంబానికి తప్ప మరెవరికీ చెప్పాలేదన్నారు.  హైదరాబాద్, రాజమహేంద్రవరం మార్గమధ్యంలో రెండు చోట్ల ఆగిన ప్రవీణ్… ఆ రెండు ప్రాంతాల్లోని వైన్ షాపుల్లో డిజిటల్ పే మెంట్లు చేశారని అందుకు సంబంధించిన రుజువులు చూపారు. అలాగే మార్గ మధ్యంలో ఆయన ఆరుగురితో మాట్లాడారనీ, ఆ విషయాన్ని కూడా తాము  ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీల ద్వారా ధృవీకరించు కున్నామన్నారు.  

 ప్రవీణ్ పగడాల  పోస్టుమార్టం నివేదిక కూడా  ఆయన రోడ్డు ప్రమాదం కారణంగానే ప్రవీణ్ చనిపోయినట్లుతేల్చిందని చెప్పారు.  విచారణలో భాగంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులతో పాటుగా ఆయా ప్రాంతాలకు చెందిన దాదాపుగా 113 మందిని విచారించామని తెలిపారు. ప్రవీణ్ ప్రయాణించిన దూరంలో ఉన్న దాదాపుగా అన్ని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి విచారణ సాగించామని తెలిపారు.  ఈ మొత్తం విచారణలో పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదం కారణంగానే  చనిపోయారని తేలిందని ఐజీ చెప్పారు.