TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో త్రిముఖ పోరు అనివార్యం.. తెలుగుదేశం ఓటు బ్యాంకుపైనే పార్టీల ఆరాటం

Published on: Mon May 30, 2022 11:26AM

వచ్చే ఎన్నికలలో తెలంగాణలో త్రిముఖ పోరు అనివార్యం అని అంతా భావిస్తున్న నేపథ్యంలో  ఈ ఎన్నికలలో  విజయం కోసం ప్రధాన పార్టీలన్నీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుపైనే దృష్టి పెట్టాయి. రాష్ట్ర అసెంబ్లీలో కనీస ప్రాతినిథ్యం కూడా లేని తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు ఏమిటని ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణ సెంటిమెంటుతో సంబంధం లేకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. ఆ ఓటు బ్యాంకు గత రెండు ఎన్నికలలో దాదాపు తటస్థంగా ఉండిపోయిందన్నది పరిశీలకుల అంచనా.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీని వీడి వేరే వేరే పార్టీలలో చేరిపోయారు. తెలుగుదేశం నేతలను భారీగా చేర్చుకున్న పార్టీ మాత్రం టీఆర్ఎస్సే. రేవంత్ రెడ్డి వంటి వారు కాంగ్రెస్ గూటికి చేరారు. మరి కొందరు కమలం కండువా కప్పుకున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశంలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా తెలంగాణ ఆవిర్భావం తరువాత ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం చెక్కు చెదరలేదని పరిశీలకులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో, స్థానిక సమరంలో తెలంగాణలో తెలుగుదేశం అభ్యర్థులు పోటీలో ఉండటమే అందుకు తార్కాణంగా చెబుతున్నారు.

తెలంగాణలో రంగంలో ఉన్న అభ్యర్థులకు పార్టీ నుంచి మద్దతు ఉన్నా లేకున్నా.. తమ సొంత ఖర్చులతో పార్టీపై అభిమానంతో వారు రంగంలోకి దిగుతున్నారు. పార్టీ జెండా భుజాన వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. వీరే కాకుండా.. హైదరాబాద్ ప్రగతి వెనుక తెలుగుదేశం కృష్టి, చంద్రబాబు హయాంలో అనుసరించిన విధానాలు ఉన్నాయని నమ్మే వర్గం ఒకటి ఉంది. హైదరాబాద్ ఐటీ హబ్ గా రూపుదిద్దుకోవడం వెనుక చంద్రబాబు కృషి ఉందని స్వయంగా తెలంగాణ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావే పలు మార్లు ప్రస్తావించారు. చంద్రబాబు వేసిన పునాదులపైనే తాను ముందుకు సాగానని చెప్పిన సంగతి కూడా తెలిసిందే. అదే భావన హైదరాబాద్ లో స్థిరపడిన పలువురిలో బలంగా ఉంది. అందుకే హైదరాబద్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలలోనూ, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనూ గత రెండు ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు పడ్డాయి.  ఆ ఓటుపైనే పార్టీలు ఇప్పుడు దృష్టి పెట్టాయి.   వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో త్రిముఖ పోరు అనివార్యం అని భావిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఉన్న ఓటుపై దృష్టి సారించాయి.

త్రిముఖ పోరు నేపథ్యంలో  ప్రతి ఓటూ కీలకమేని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే రాష్ట్రంలో తెలుగుదేశానికి ఉన్న అభిమానాన్ని సొమ్ము చేసుకుని లబ్ధి పొందాలని భావిస్తున్నాయి. అందుకు అంది వచ్చిన అవకాశంగా ఎన్టీఆర్ జయంతి సందర్భాన్ని బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ లు భావించాయి. ఈ విషయంలో మిగిలిన రెండు పార్టీల కంటే టీఆర్ఎస్ ముందుంది. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ జయంతి, వర్థంతిలను పట్టించుకోని టీఆర్ఎస్.. ఈ ఏడాది మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరీ కార్యక్రమాలు నిర్వహించింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా  ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులర్పించడం, రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు చేపట్టడం ఇందులో భాగంగానే చూడాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధిని ప్రత్యేక  ప్రస్తావించడాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఈ ఎనిమిదేళ్లలో ఎన్నడూ టీఆర్ఎస్ ఎన్టీఆర్ ను స్మరించుకున్న దాఖలాలు లేవని వారు చెబుతున్నారు. త్రిముఖ పోటీ అనివార్యమన్న నేపథ్యంలోనే టీఆర్ఎస్ కు ఇప్పుడు ఎన్టీఆర్, ఆయన సేవలు గుర్తుకొచ్చాయని వారు విశ్లేషిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ గూటికి వచ్చిన వ్యక్తి ఆయన ఎన్టీఆర్ పట్ల ప్రత్యేక గౌరవం, అభిమానం ఉన్న వ్యక్తి. తెలుగుదేశం పార్టీ వీడిన తరువాత ఇప్పటి వరకూ ఆ పార్టీపై కానీ, ఆ పార్టీ అధినేతపై కూడా చిన్న పాటి విమర్శ చేసిన దాఖలాలు కూడా లేవు. తెలంగాణ రాష్ట్రంలో కనీసంలో కనీసం 35 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉందన్నది పార్టీల అంచనా, ఉమ్మడి ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ, మెదక్ జిల్లాలలో నేటికీ తెలుగుదేశం క్యాడన్ చెక్కు చెదరకుండా ఉందన్నది పార్టీల అంచనా. ఆ కారణంగానే ఆ ఓటు బ్యాంకుపై గురి పెట్టేందుకు ఎన్టీఆర్ శత జయంతిని ఒక అవకాశంగా తీసుకుని కార్యక్రమాలను రూపొందించుకునే పనిలో పార్టీలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.