TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విపక్షాల ఆందోళన రెండో రోజు లోక్ సభ వాయిదా

Published on: Tue Jul 22, 2025 4:28PM


 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండవరోజు ఎలాంటి చర్చ లేకుండా వాయిదా పడ్డాయి. విపక్ష సభ్యుల ఆందోళన బీహార్‌లో ఎన్నికల ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR), ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రవాద దాడి వంటి అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. 

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సభ మొదలైన కొద్ది నిమిషాల్లోనే విపక్ష సభ్యుల నిరసనలతో మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అటు నిరసన హోరుతో సభను రోజంతా వాయిదా వేసి, రేపు ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. 

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, విపక్షాలు చర్చకు డిమాండ్ చేస్తూనే సభను నడవనీయకుండా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ ఆందోళనల నడుమ, రాజ్యసభలో షిప్పింగ్ డాక్యుమెంటేషన్ చట్టాలను ఆధునీకరించే లాడింగ్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ, లోక్‌సభలో వాయిదా తీర్మానాలపై చర్చ జరగలేదు.

హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు సహకరించాలని కేంద్రాన్ని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి  కోరారు. నగరానికి సెకండ్ ఫేజ్ మెట్రో మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇవాళ లోక్ సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో మెట్రో రెండో దశ గురించి  ఎంపీ చామల మాట్లాడారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మెగా నగరం అని ఇది దేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడుతోందన్నారు.