టి.ఆర్.ఎస్. కు ప్రతిష్టాత్మకంగా మారిన పరకాల ఉప ఎన్నికలు
Published on: Sat May 5, 2012 12:42PM
వరంగల్ జిల్లా పరకాల శాసనసభ ఉప ఎన్నిక టి.ఆర్.ఎస్.కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించకపొతే తెలంగాణా సెంటిమెంటు బలహీనపడుతుందనే భయాన్ని ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. గతనెలలో జరిగిన ఉప ఎన్నికల్లో టి.ఆర్.ఎస్. అభ్యర్థులు తమ స్థానాలను నిపుకోగలిగారు. కానీ, పరకాలలో తాజామాజీ అయిన కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ స్థానాన్ని కైవసం చేసుకుని తెలంగాణా సత్తా చాటాలని టి.ఆర్.ఎస్. భావిస్తోంది.
కానీ పరిస్థితులు మాత్రం ఆ పార్టీకి ప్రతికూలంగా మారుతున్నాయి. పరకాలలో టి.ఆర్.ఎస్.తో పాటు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా పోటీ చేయబోతున్నారు. దీనికి తోడు కోదండరామ్ నేతృత్వంలోని జాయింట్ యాక్షన్ కమిటీకి, టి.ఆర్.ఎస్. కు మధ్యన ప్రచ్చన్నయుద్ధం సాగుతోంది. జె.ఎ.సి. ఇటీవలి మెహబూబ్ నగర ఎన్నికల్లో టి.ఆర్.ఎస్. అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోవడంతో అక్కడ టి.ఆర్.ఎస్. పరాజయం పాలైంది. ఈ సారి కూడా జె.ఎ.సి. మద్దతు టి.ఆర్.ఎస్. కు లభించేలా కనిపించటం లేదు. ఒకవైపు టిడిపి, బిజెపి వల్ల తెలంగాణవాద ఓట్లలో చీలిక, మరోవైపు జె.ఎ.సి. మద్దతు లేకపోవటం టి.ఆర్.ఎస్. నాయకులను కలవరపెడుతోంది. దీనికి తోడు తాజా మాజీ కొండా సురేఖ కూడా ఎన్నికల్లో విజయానికి కృషి చేస్తున్నారు


