పరకాలలో ఎన్నికల భేరి మోగించిన బిజెపి
Published on: Sat Apr 21, 2012 10:43AM
పరకాలలో ఉప ఎన్నిక జరిగే తేదీ ఇంకా ఖరారు కాలేదు. బిజెపి తన అభ్యర్థిని కూడా నిర్ణయించలేదు. అయితే ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్నికల ప్రచారానికి మాత్రం శ్రీకారం చుట్టారు. మహబూబ్ నగర ఉప ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహంతో పరకాలాలో వారు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఆత్మకూరు, గీసుకొండ, సంగం మండలాల్లో ఆ పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పరకాల పట్టణంలో మొత్తం 23 పోలింగ్ బూత్ లు ఉన్నాయి.
ఈ పోలింగ్ బూత్ ల వారీగా ఇక్కడ కమిటీలను ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో ముగ్గురు మహిళలకు స్థానం కల్పించారు. కమిటీ సభ్యులు ఉదయం, సాయంత్రం ఓటర్ల జాబితాను చేతబట్టుకుని తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లోని ఇంటింటికి వెళుతున్నారు. తొలుత కార్యకర్తల జాబితాను రూపొందిస్తున్నారు. మహిళా సంఘాల నాయకురాళ్ళు, కులసంఘాల ముఖ్యులు, ఐరాస నాయకుల పేర్లను సేకరిస్తున్నారు. చాలా పకడ్బందీగా బిజెపి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో పరకాల ఎన్నికలను ఆ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు అర్థమవుతోంది. తాము వ్యూహాత్మకంగా ముందుకు వెళితే ఓట్లు సాధించటం సులభమని బిజెపి నేతలు భావిస్తున్నారు. పరకాలలో విజయం సాధించగలిగితే తెలంగాణా ఉద్యమంపై పట్టు మరింత బిగించవచ్చునని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. బిజెపి పోటీ నుంచి తప్పుకోవాలన్న పొలిటికల్ జెఎసి, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల డిమాండ్ ను ఆ పార్టీ నాయకులు ఖాతరు చేయడం లేదు.


