కోల్ కతా వన్డే లో భారత్ ను చిత్తు చేసిన పాకిస్తాన్
posted on Jan 4, 2013 1:38PM
కోల్ కతాలో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ భారత్ ను చిత్తు చేసింది. 85 పరుగుల తేడాతో భారత్ పై ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్ ల సిరీస్ ను ఇంకా ఒక వన్డే మిగిలి ఉండాగానే కైవసం చేసుకుంది. 251 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. గంభీర్ 25 బంతుల్లో 11పరుగులు మాత్రమే చేసి జునైద్ బౌలింగ్ లో అవుటయ్యాడు. విరాట్ కోహ్లి కేవలం ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో ఇండియా 55 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత సెహ్వాగ్ కూడా 31 పరుగులు చేసి ఉమర్ గుల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. పాకిస్తాన్ బౌలర్ల దెబ్బకి భారత బాట్స్ మెన్ లు మాత్రం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పెవిలియన్ కి క్యూ కట్టారు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ను 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా అవుట్ చేయడంతో ప్రారంభమైన వికెట్ల పతనం చివరి వరకు కొనసాగుతూ వచ్చింది. ఓ వైపు వికెట్లు పడిపోతుంటే జంషెడ్ గట్టిగా నిలబడి సెంచరీ చేశాడు. 124 బంతుల్లో 106 పరుగులు చేసి అతను జడేజా బౌలింగులో అవుటయ్యాడు.
ఒక దశలో 300 పైగా స్కోరు పాకిస్తాన్ చేస్తుందని అనుకున్నారు. కాని రవీంద్ర జడేజా మూడు ముఖ్యమైన వికెట్లు తీసి పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ ను దెబ్బ తీశాడు. రవీంద్ర జడేజా కు ఇషాంత్ శర్మ సూపర్ బౌలింగ్ తోడవడంతో పాకిస్తాన్ను 250 పరుగులకు భారత్ కట్టడి చేసింది.