భారత్ సరిహద్దుకు పాక్ యుద్ధవిమానాలు!!
posted on Aug 12, 2019 6:34PM
కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుతో భారత్ పాక్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో పాక్ చర్యలు ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. లడఖ్ సరిహద్దుల్లోని పాక్ భూభాగంలో గల స్కర్దు ఎయిర్బేస్కు పాక్ బలగాలు సైనిక సామగ్రిని పెద్ద ఎత్తున తరలిస్తున్నాయి. పాక్ ఎయిర్ఫోర్స్కు చెందిన మూడు సీ-130 ట్రాన్స్పోర్ట్ విమానాలు ఈ పరికరాలను తీసుకొచ్చాయి. యుద్ధ విమానాల ఆపరేషన్స్లో ఉపయోగించే సామగ్రిని పాక్ సరిహద్దులకు తరలించినట్లు తెలుస్తోంది. అంతేగాక.. పాక్ తమ జేఎఫ్-17 యుద్ధ విమానాలను కూడా ఎయిర్బేస్కు తరలించే యోచనలో ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం.
స్కర్దు ఎయిర్బేస్ లడఖ్కు అత్యంత సమీపంలో ఉంటుంది. సరిహద్దుల్లో పాక్ చేపట్టే సైనిక ఆపరేషన్స్కు ఎక్కువగా ఈ బేస్నే ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు అక్కడ సైనిక పరికరాలను తరలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పుల్వామా దాడి అనంతరం.. భారత్ బాలాకోట్ దాడి చేపట్టిన తరువాత మన గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాలు దూసుకొచ్చే ప్రయత్నం చేశాయి. అయితే వాటిని భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. తాజాగా కశ్మీర్ అంశం నేపథ్యంలో పాక్ మరోసారి అలాంటి చర్యకు దిగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.