TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆడలేకపోతే మద్దెలు ఓడే.. కాంగ్రెస్ పై పీకే వ్యాఖ్యలకు కారణం ఇదే!

Published on: Wed Jun 1, 2022 7:30AM

కాంగ్రెస్ లో చేరి చక్రం తిప్పుదామని శతధా ప్రయత్నించి భంగపడిన ప్రశాంత్ కిశోర్ కు ఇప్పుడు కొత్తగా జ్ణానోదయం అయ్యింది. కాంగ్రెస్ మునిగిపోయే పవడ అనీ దానితో వెడితే మునిగిపోతానని తెలుసుకున్నానని చెబుతున్నారు. కాంగ్రెస్  
వల్ల తన ట్రాక్ రికార్డ్ పాడైందంటున్నారు. అలా పాడైందని ఇప్పుడే గుర్తించారా అని పరిశీలకులు వేస్తున్న ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. ఎప్పుడో 2017లో యూపీ ఎన్నికల్లో తాను కాంగ్రెస్ తరఫున పని చేసి కూడా ఆ పార్టీని గెలిపించలేకపోయాననీ, అది తప్ప తాను ఏ పార్టీ తరఫున, ఏ కూటమి తరఫున పని చేసినా ఆ పార్టీ, ఆ కూటమి విజయాలు సాధించాయనీ, ఒక్క 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే తాను కాంగ్రెస్ తరఫున పని చేసినా ఆ పార్టీ గెలవలేదనీ ప్రశాంత్ కిశోర్ అంటున్నారు.

అయితే పరిశీలకులు మాత్రం పార్టీల విజయాలలో ప్రశాంత్ కిశోర్ పాత్ర ఏమీ లేదనీ, అందుకు తార్కానం ఒక సారి ఆయన పని చేసిన పార్టీకి మరోసారి పని చేయకపోవడమే నిదర్శనమని సోదాహరణంగా చెబుతున్నారు. ఇంతకీ ప్రశాంత్ కిశోర్ కు హఠాత్ జ్ణానోదయం కలగడానికి ఆయన బోధి వృక్షం కింద ఏమీ కూర్చోలేదు. కాంగ్రెస్ తరఫున పని చేయడానికి, బీజేపీయేతర పార్టీలన్నిటినీ కాంగ్రెస్ గొడుగు కిందకు తీసుకు రావడానికి శతధా ప్రయత్నించారు. ఒక దశలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి కూడా సిద్ధమయ్యారు.

పలు మార్లు కాంగ్రెస్ అధినాయకత్వంతో కూడా సమావేశమయ్యారు. కానీ పార్టీ మౌలిక విధానాలను వీడి బయటకు రావడానికి ఆ పార్టీ సుతరామూ అంగీకరించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేరిక ఆలోచనను విరమించుకున్నారు. తాజాగా ఆయన జన్ సూరజ్ యాత్ర తలపెట్టారు. తన స్వరాష్ట్రమైన బీహార్ లో ఈ యాత్ర మంగళవారం ప్రారంభించారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా తన ‘ఘన’తలను వివరించుకున్నారు.

 2015లో బీహార్. 2017లో పంజాబ్, 2019లో ఏపీ ఎన్నికలలో తాను పని చేసిన పార్టీలన్నీ ఘన విజయాలు సాధించాయన్నారు. ఒక్క యూపీలోనే కాంగ్రెస్ కోసం పని చేసినా ఆ పార్టీని గెలిపించలేకపోయాననీ చెప్పుకొచ్చారు. అప్పుడే ఆ పార్టీతో కలిసి ఇక ముందు పని చేయకూడదని నిర్ణయించుకున్నాన్నారు. మరి 2022లో ఆ పార్టీలో చేరడానికి చేసిన ప్రయత్నాలు, కాంగ్రెస్ తో కలిసి బీజేపీయేతర కూటమి ఏర్పాటు కోసం చేసిన యత్నాల మాటేమిటన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు.