80 రూపాయలకు చేరుకున్న ఉల్లి...
Published on: Tue Sep 24, 2019 5:56PM

ఉల్లి ధరలు భారతీయుల్ని బెంబేలెత్తిస్తున్నాయి, తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. ఉల్లి పంట దిగుబడులు తగ్గడానికి తోడు కృత్రిమ కొరతతో రేటు అమాంతం పెరిగిపోయింది. ఉల్లి పాయలను ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు వ్యాపారులు. వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. నాలుగేళ్ళలో ఎన్నడూ లేనంత గరిష్టానికి ఉల్లిపాయ ధర పెరిగింది.
ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ ఎక్కడ చూసినా కిలో ఉల్లిని ఎనభై రూపాయలకు అమ్ముతున్నారు వ్యాపారులు. నాసిరకం ఉల్లిని కొనాలన్నా జేబులు తడుముకోవాల్సిన దుస్థితి నెలకొంది. నాణ్యత ఉన్న ఉల్లి కిలో ఎనభై రూపాయలకు మించి అమ్ముడుపోతోంది. ఉల్లి ధరలు ఘాటెక్కిస్తోంది, సామాన్యుడికి అందనంత ధరలు పెరిగిపోయాయి. విజయవాడ మార్కెట్ లో రెండు నెలల్లోనే పన్నెండు నుంచి అరవై రూపాయలకు కిలో ఉల్లి ధర చేరిపోయింది.
రెండు ఉల్లిపాయలు వేస్తేనే సరిగా కూర అవ్వదు అలాంటిది ఇప్పుడు ఉల్లి ధర పెరిగిపోవటంతో ఒక్కో ఉల్లిపాయ వేసి కూర వండుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యతరగతి వారికి కుటుంబం గడుపుకోవటమే కష్టంగా ఉంటుందనీ అలాంటిది ఇలా రేట్లు పెంచితే అది కూడా కష్టమని ప్రజలంతా బాదకు గురౌతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుని మద్య తరగతి, పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.


