తగ్గిన మల్లాది విష్ణు ప్రాధాన్యత!
Published on: Tue May 15, 2012 11:03AM
విజయవాడ నగరంలో నిన్నమొన్నటి వరకు ఏకఛత్రాదిపత్యంగా చక్రం తిప్పిన తిప్పిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మలాది విష్ణు ప్రాధాన్యత తగ్గినట్టుగా కనిపిస్తోంది. నగరం పరిథిలో తూర్పు, పశ్చిమ, మధ్య అనే మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు వున్నాయి. 2009 ఎన్నికల్లో ఈ మూడింటిలో సెంట్రల్ (మధ్య) నియోజకవర్గం నుంచి గెలుపొందిన విష్ణు మాత్రమే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. మిగిలిన రెండు నియోజక వర్గాలలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దాంతో నగరం లోని ప్రజలు ప్రభుత్వపరంగా ఏ పని కావాల్సి వచ్చినా విష్ణు వద్దకే వచ్చేవారు. పార్టీ కార్యాలయం వద్ద మూడు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు కనిపించే వారు. అయితే ఇటీవల పరిణామాలలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో నగరంలోని మిగిలిన రెండు నియోజకవర్గాలకు చెందిన నేతలు కూడా అధికారపార్టీకి చెందిన శాసనసభ్యులుగా మారిపోవడంతో విష్ణు వద్దకు వచ్చే ప్రజల సమాఖ్య కూడా తగ్గిపోయింది. అధికారులు కూడా గతంలో విష్ణు మాటకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. మిగిలిన ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులుగా మాత్రమే పరిగణించేవారు. కాని ప్రస్తుతం అధికారులు కూడా మిగిలిన ఇరువురు శాసన సభ్యులను కూడా అధికార ప్రతినిధిగా చూస్తున్నారు.


