నాగులపంచమి రోజయినా సరే పాముకు పాలు పోస్తే ఇక జైలుకే...!

 

పరమశివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిగా పాముల్ని పూజిస్తారు హిందువులు. నాగులపంచమి రోజున పాలు, పూలు పెట్టి నాగదేవతగా భావించి పూజిస్తారు. అయితే ఇక ముందు అలా చేయడం నేరం అంటున్నారు అటవీ శాఖ అధికారులు, పాములకి పాలుపోయడం అంటే హెరాస్ చేయడమేనని, పాలు పోసి ఇబ్బంది పెడితే కేసులు ఎదుర్కోవాల్సిందేనని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

ఆగస్టు 5న నాగుల పంచమి సందర్భంగా పాముల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నిన్న హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌‌లో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో అటవీశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. నాగుల పంచమి సందర్భంగా పాములకు తాగిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ ప్రకటించారు. సాధారణ రోజుల్లో పాముల పుట్ట వైపే వెళ్లడానికి భయపడే ప్రజలు నాగపంచమి, నాగులచవితి పర్వదినాలు వచ్చాయంటే అక్కడికి పరుగులు పెడతారు. 

పాముకు పూజలు చేసి పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకుంటుంటారు. కానీ అలా నాగుల పంచమి రోజున పాములను ఆడించడం, పాలు తాగించడం వంటిని జంతుహింస చట్టం కిందకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. పాములు పాలు తాగవని, వాటికి బలవంతంగా తాగించి ఇబ్బంది పెట్టొద్దని అంటున్నారు. దేవాలయాల వద్దకు ఎవరైనా పాములతో వస్తే ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడ ఆయన సూచించారు.