TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మూసి రివర్ ఫ్రంట్ కు తొలగిన అడ్డంకి.. ఆ భూముల అప్పగింతకు రక్షణ శాఖ ఓకే!

Published on: Fri Jun 19, 2026 6:38PM

హైదరాబాద్  సౌందర్యానికి సరికొత్త హంగులు అద్దుతూ, మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టులో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బాపూఘాట్ సరోవర్  నిర్మాణానికి   లైన్ క్లియర్ అయింది. హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన బాపూఘాట్ ప్రాంతంలో మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పట్టుదల ఎట్టకేలకు ఫలించింది.

ఈ భారీ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకిగా మారిన భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. బాపూ సరోవర్ నిర్మాణానికి అవసరమైన అత్యంత కీలకమైన రక్షణశాఖ భూముల బదలాయింపునకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ అధికారికంగా అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం (జూన్ 19) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో  సుమారు 550 కోట్ల రూపాయల భారీ వ్యయంతో చేపట్టతలపెట్టిన ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నుండి ఈ కీలక అనుమతి రావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు  ధన్యవాదాలు తెలియజేశారు.

వాస్తవానికి, గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించతలపెట్టిన ప్రతిపాదిత ప్రాంతంలో రక్షణ శాఖ భూములు విస్తరించి ఉన్నాయి. చారిత్రాత్మక గోల్కొండ ఆర్టిలరీ పరిధిలోకి వచ్చే ఈ భూముల కేటాయింపు ప్రక్రియ రక్షణశాఖ అనుమతులతో ముడిపడి ఉంది. బాపూ సరోవర్ ప్రాజెక్టు అనుకున్న విధంగా సాకారం కావాలంటే రక్షణశాఖకు చెందిన  84 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ కావడం   తప్పనిసరి. రక్షణ శాఖ ఇప్పుడు ఈ 84 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు  అంగీకరించింది.