అవి కేవలం భవనాలు కాదు.. అమరావతి పురోగతికి నిదర్శనాలు
Published on: Wed May 13, 2026 11:05AM
.webp)
ఏళ్ల తరబడి అమరావతి ఒక క్రియాశీలక రాజధాని ప్రాజెక్టుగా కంటే ఎక్కువగా రాజకీయ చర్చగానే మిగిలిపోయింది. అమరావతి చుట్టూ జరిగిన ప్రతి చర్చ చివరికి విధానం, ప్రాంతం, రాజకీయాలు లేదా కోర్టు పోరాటాలుగానే సాగింది. ఈ నేపథ్యంలోనే 2019 - 2024 మధ్య కాలంలో క్షేత్రస్థాయిలో నిర్మాణాల వేగం మందగించింది. అమరావతి పురోగతిపై అనిశ్చిత పెరిగింది. అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
అయితే ఆ అనిశ్చితిని, అనుమానాలనూ పటాపంచలు చేస్తూ.. 12 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస టవర్ల నిర్మాణం పూర్తి చేసింది తెలుగుదేశం కూటమి సర్కార్. ఇదే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ టవర్లు ఆధునిక సౌకర్యాలతో పూర్తిగా సిద్ధమయ్యాయనీ, త్వరలో జీఏడీకి అప్పగిస్తామనీ మంత్రి ప్రకటించారు.
మాములుగా చూస్తే.. ఇవి సాధారణ మౌలిక సదుపాయాల నవీకరణలుగా కనిపిస్తాయి కానీ, రాజకీయంగా ప్రభుత్వం వేసిన అడుగు.. అమరావతిపై అనిశ్చితిని పటాపంచలు చేసింది. నిర్దిష్ట కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి అవుతుందన్న విశ్వాసాన్ని ప్రజలకు ఇచ్చింది. కంటికి కనిపించే నిర్మాణాలు, పనిచేసే కార్యాలయాలు ఇక ఎక్కువ జాప్యం లేకుండానే అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు భరోసా ఇచ్చాయి.


