రాంగోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్
Published on: Fri Mar 7, 2025 9:32AM

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఒకదాని వెంట ఒకటిగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జగన్ హయాంలో సోషల్ మీడియా వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్ లను కించపరిచే విధంగా చేసిన కామెంట్లు, సినిమాల విషయంలో ఏపీలో కేసులను ఎదుర్కొంటూ విచారణలకు హాజరౌతున్న రామ్ గోపాల్ వర్మపై తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయ్యింది.
అయితే ఈ వారెంట్ జారీ చేసినది ముంబై కోర్టు. అది కూడా చెక్ బౌన్స్ కేసులో. చెక్ బౌన్స్ కేసులో తనకు జ్యుడీషియల్ కోర్టు విధించిన మూడునెలల జైలు శిక్షను శిక్షను రద్దు చేయాలన్న వర్మ అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. రాంగోపాల్ వర్మకు చెందిన సంస్థ తమకు ఇచ్చిన చెక్కు బ్యాంకులో బౌన్స్ అయ్యిందంటూ 2018లో ఓ కంపెనీ కోర్టును ఆశ్రయించింది. ఆ కేసులో ఈ ఏడాది జనవరి 21న అంధేరీలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు మూడునెలల జైలు శిక్ష విధించింది. అదే విధంగా ఫిర్యాదుదారుడికి మూడు నెలల్లోగా రూ.3,72,219 చెల్లించాలని ఆదేశించింది.
ఈ తీర్పును రామ్ గోపాల్ వర్మ సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. వర్మ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం మార్చి 4న ఆయన పిటిషన్ ను కొట్టివేస్తూ, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆర్జీవీ కోర్టుకు హాజరై బెయిలుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది.


