TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నామినేటెడ్ పోస్ట్‌ల భర్తీకై తెలంగాణ నేతల ఎదురు చూపులు... ఇంకెంత కాలం?

Published on: Fri Oct 4, 2019 4:31PM

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలల్లో గెలిచి ఇన్ని సంవత్సరాలు కావొస్తున్న ఇప్పటికి నేతలకు పూర్తి స్థాయిలో వారి పోస్ట్లు భర్తీ కాలేదు .రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేదు. కొంతమందికి మాత్రమే ఆ పదవులిచ్చారు. మిగతా ఆశవాదులు ఆ పదవుల కోసం ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూ వస్తున్నయి. నామినేటెడ్ పదవుల భర్తీ దసరాలోపు ఉండొచ్చనే చర్చ టీఆర్ ఎస్ పార్టీలో జరుగుతోంది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ లోనే ఆశావహులంతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ పదవుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు.

మంత్రి పదవులు దక్కక నిరుత్సాహానికి లోనైన ఎమ్మెల్యేలు కూడా కీలకమైన నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. వీరితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలు సైతం హోదా కోసం ఏదో ఒక పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇక మొదటి నుంచి టిఆర్ఎస్ జెండా మోసే నాయకులూ తమకెప్పుడు అవకాశం దక్కుతుందని నిరీక్షిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో చాలా మంది నేతలు కేటీఆర్ చాంబర్ కు క్యూ కట్టారు. త్వరలోనే అన్ని పదవులు భర్తీ చేస్తామని అప్పట్లో ఆయన హామీ ఇవ్వడంతో తమకు పదవులు దక్కుతాయని ఆశల పల్లకిలో వారిప్పుడు ఊరేగుతున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన శాసన సభ ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు పార్టీ టికెట్ దక్కని నేతలుకు తగిన పదవిచ్చి గౌరవిస్తామని టీఆర్ఎస్ హైకమాండ్ హామీ ఇచ్చింది.

అలాగే లోక్ సభ ఎన్నికల్లో టికెట్ దక్కని సీతారాం నాయక్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన జూపల్లి క్రిష్ణరావు, తుమ్మల నాగేశ్వర్ రావు తో సహా మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మండవ వెంకటేశ్వర రావు, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తదితర నేతలకు సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం. వీరేగాకుండా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, ప్రతాపరెడ్డి లాంటి నేతలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రయారిటీ ఇస్తామని హామీ ఇవ్వడంతో వారంతా పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే వివిధ కార్పొరేషన్ ఛైర్మన్ లుగా ఉన్న నేతల్లో కొందరు పదవీ కాలం ముగియగా మరి కొందరిది త్వరలోనే పూర్తి కానుంది. దీంతో రెన్యువల్ కోసం సదరు నేతలంతా కేటీఆర్ ను కలిసి ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఒకవేళ పోస్టుల భర్తీ చేస్తే పదవులు దక్కని నేతలు అసంతృప్తికి లోనవుతారనే భయం టీఆర్ఎస్ లో నెలకొనదని చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే నామినేటెడ్ పదవులకు భర్తీ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఒకవేళ హుజూర్ నగర్ ఉప ఎన్నిక, మరోవైపు త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీ తప్పకుంటుందని గులాబి వర్గాలంటున్నాయి. మరి ఈ  నామినేటెడ్ పోస్టులు ఎప్పటికి దక్కుతాయి అనేది తెలియాలంటే వేచి చూడక తప్పదు.