TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉద్యోగాల ప్ర‌క‌ట‌న‌కు స్పందన కరవు.. కేసీఆర్‌ను న‌మ్మ‌ట్లేదా?

Published on: Thu Mar 10, 2022 9:55AM

ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పేంటి? ఎందుకు ఆయన్ని ఎవరూ నమ్మడం లేదు? హుజురాబాద్’లో ప్రజలు అడిగినవీ, అడగనివీ అన్నీ ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి ఇంకేం కావాలని, అడిగి మరీ, ప్రభుత్వ పథకాల పంచారు.  పార్టీ పైసలు కవర్లలో పెట్టి ఇచ్చారు.  నియోజక వర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న దళిత ఓటర్ల కోసం దళిత బంధు పథకం తెచ్చారు. ఫ్యామిలీకి పది లక్షలు ఎరగా వేశారు. ఇతరులకు, రేషన్ కార్డు మొదలు పెన్షన్ల వరకు చాలా చాలా వ్యక్తిగత ప్రయోజనం చేకూర్చే పథకాలను, ఒక్క హుజురాబాద్’కే పరిమితం చేసి పందారం చేశారు.  ఓటుకు పదివేలు చొప్పున పంచారు. నిజానిజాలు ఎలా ఉన్నా, పదివేలు ముట్టని మహిళలు వీధుల్లోకి వచ్చి, ‘ఓటు’ పైసల కోసం రోడ్ల్ మీదకు వచ్చి, ధర్నాలు చేశారు. చివరకు, దేశంమొత్తంలో ఇంతవరకు జరిగిన ఎన్నికలు అన్నింటిలోకి అత్యంత ఖరీదైన ఎన్నిక అనిపించే స్థాయిలో డబ్బులు కుమ్మరించారు. ఇంత చేసినా, చివరకు ఫలితం దక్కలేదు. 

అది మొదలు ముఖ్యమంత్రి కేసేఆర్’కు వరసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయని,   రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా రాష్టంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రజలే కాదు రాజకీయ పార్టీలు, నాయకుల విశ్వాసాన్ని కూడా కోల్పోయారని అంటున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేద్దామని, దేశాన్ని చుట్టి వస్తున్నారు.ఎంతో మంది నాయకులను కలుస్తున్నారు, అయినా ఒక్కరంటే ఒకక్రు కూడా, ఆయనతో జట్టు కట్టేందుకు సిద్ధంగా లేరని, స్పష్టమవుతోంది. 

అదలా ఉంటే, ఎన్నో ఆశలు పెట్టుకున్న, ‘బాహుబలి’ ఉద్యోగ ప్రకటన కూడా పెద్దగా ఆశించిన ఫలితాన్నిఇవ్వలేదని,తెలంగాణ భవన్ వర్గాల సమాచారం. జిల్లాలనుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి, తెరాస నేతలు మొక్కుబడి సంబురాలు చేకోవడమేకానీ, ఉత్సాహంగా నిరుద్యోగ యువకులు, విద్యార్ధులు సంబురాలు చేసుకున్నది లేదని, తెలుస్తోంది. ముఖ్యమంత్రి ముందుగానే, పది గంటలకు బ్రహ్మండం బద్దలు అయ్యే ప్రకటన ఉంటుందని ప్రకటించినా, ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని, దేమిటో ముందుగానే ఉహించడంతో పాటుగా ప్రకటన వెంక ఉన్న కుట్రను కూడా యువకులు ముందుగానే గుర్తించారని, అందుకే ఎవరూ సీఎం ప్రకటనను సీరియస్’గా తీసుకోలేదని అంటున్నారు.  
అంతే కాకుండా, నిరుద్యోగులను ఎవరిని కదిల్చినా, ముఖ్యమంత్రి భారీ ప్రకటనలు చేయడం ఇదే తొలిసారి కాదు. హుజూర్’నగర్ మొదలు హుజూరాబాద్ వరకు ప్రతి ఎన్నిక, ఉప ఎన్నికముందు, ఇలాంటి ప్రకటనలే చేశారు. కానీ, ముఖ్యమంత్రి ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి, నోటి మాటగానే మిగిలిపోయాయని,అందుకే ముఖ్యమంత్రి ప్రకటనపై నమ్మకం కుదరడం లేదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అని చెప్పి, చివరకు అసలు అలాంటి హమీనే ఇవ్వలేదని అదే అసెంబ్లీ ప్రకటించిన ముఖ్యమంత్రిని నమ్మేదెలా?అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 

అందుకే, గత అనుభవాల ఆధారంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా నోటిఫికేషన్లే ఇవ్వదని, ఇచ్చినా ఏదో ఓ వివాదంతో కాలయాపన చేస్తారని.. డబుల్ బెడ్ రూం ఇళ్లు, వరద సాయం… దళిత బంధు తరహాలోనే, మభ్య పెట్టి ఎన్నికలకు వెళ్తారని.., విపక్షాలు అడ్డుకున్నాయని ప్రచారం చేస్తారని అనుమానిస్తున్నారు. అందుకే నిరుద్యోగుల్లో అంత ఉత్సాహం కనిపించడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే, తెరాస ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య విశ్వసనీయత కోల్పోవడమే అని పరిశీలకులు అంటున్నారు. ఈ నిజాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే, ముందస్తుకు వెళ్ళినా ప్రయోజనం ఉందని రాజకీయ పండితులే కాదు, తెరాస సీనియర్ నాయకులు కూడా లోపాయికారీ, చర్చల్లో ఆమోదిస్తున్నారు.