తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు లేనట్లే

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నడవడం ఇప్పట్లో కష్టమే అనిపిస్తోంది. ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపేందుకు బుధవారం హైదరాబాద్‌లో అధికారుల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం, టీఎస్‌ ఆర్టీసీలో ఆపరేషన్స్‌ విభాగంలో ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో చర్చల్ని వాయిదా వేశారు. దీంతో ఇప్పట్లో ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపే పరిస్థితి లేదని తెలుస్తోంది. 

ఈ నెల 17న విజయవాడలో ఏపీఎస్‌ ఆర్టీసీ, టీఎస్ ‌ఆర్టీసీ అధికారులు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు వాయిదా పడటంతో బస్సు సర్వీసులను నడిపే అంశంపై సందిగ్ధత నెలకొంది. 

కాగా, ఈ నెల 1 నుంచి 20 వరకు ఏపీఎస్ ‌ఆర్టీసీ రోజుకు సగటున 3,266 బస్సు సర్వీసుల్ని నడిపింది. 11.03 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగాయి. గత 20 రోజులుగా ఏపీఎస్ ఆర్టీసీ రోజుకు రూ.2.43 కోట్లు ఆదాయం ఆర్జించింది. కిలోమీటరుకు రూ.22.06 మాత్రమే పొందింది. కరోనాకు ముందు రోజుకు రూ.12 కోట్ల ఆదాయం ఆర్టీసీకి వచ్చేది.

మరోవైపు, ఏపీఎస్‌ ఆర్టీసీ త్వరలో సిటీ సర్వీసులు ప్రారంభించేందుకు నిర్ణయించింది. విజయవాడ, విశాఖలో నడిపే సిటీ సర్వీసుల్లో ఎక్కడ్నుంచి ఎక్కడకు వెళ్లినా ఒకే రేటు వసూలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.