TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికీ మీడియాకు నో ఎంట్రీ!

Published on: Thu May 4, 2023 3:43PM

ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. అనుకున్న ముహూర్తానికే అంటే సరిగ్గా మధ్యాహ్నం 1:05 గంటకు బీఆర్‌ఎస్‌ అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గురువారం ఉదయం నుంచి పార్టీ కార్యాలయంలో పూజలు కొనసాగాయి. అనంతరం సరిగ్గా మూహూర్త సమయానికి సీఎం కేసీఆర్‌ను పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్‌ తొలి సమావేశం నిర్వహించారు.

ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ వేళ బీఆర్‌ఎస్‌ భవన్‌లో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్‌ , ఎంపీ వెంకటేశ్‌ నేత పూజలో పాల్గొన్నారు. భవనం ప్రారంభోత్సవానికి ముందు అక్కడ నిర్వహించిన సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఆ తర్వాత భవన్‌ శిలాఫలకాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించారు . అనంతరం మధ్యాహ్నం సరిగ్గా  1:05 గంటలకు కేసీఆర్ రిబ్బన్‌ కట్‌ చేసి భవన్‌లోకి ప్రవేశించారు .భవన్‌లో దుర్గామాత అమ్మవారికి కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం భవనంలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్‌కు కేసీఆర్‌ వెళ్లి  ఆసీనులయ్యారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌కు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీలు కేశవరావు, వెంకటేశ్‌ నేత, సంతోష్‌ కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఢిల్లీ బీఆర్‌ఎస్‌ భవన్‌కు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ గురువారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇక భవనంలోని ఓ అంతస్తులో అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించారు.  అనంతరం పార్టీ నాయకులతో కలిసి కేటీఆర్‌ ఫోటోలు దిగారు. పలువురు నాయకులు కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు.  ఢిల్లీ వసంత్‌ విహార్‌లో బీఆర్‌ఎస్‌ ఆఫీసు నిర్మాణానికి 2021, సెప్టెంబర్‌ 2న సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు. మొత్తం నాలుగు అంతస్థులతో 11 వేల చదరపు అడుగుల స్థలంలో దీనిని నిర్మించారు. లోయర్‌గ్రౌండ్‌లో విూడియా హాల్‌, సర్వెంట్‌ క్వార్టర్స్‌ ఉన్నాయి.

ఇక గ్రౌండ్‌ ఫ్లోర్‌లో క్యాంటీన్‌, రిసెప్షన్‌ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల చాంబర్‌లు, మొదటి అంతస్థులో బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్‌ చాంబర్‌, ఇతర చాంబర్స్‌, కాన్ఫరెన్స్‌ హాల్స్‌, 2వ, 3వ అంతస్థుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి. వీటిలో పార్టీ ప్రెసిడెంట్‌ సూట్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సూట్‌పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉంటాయి. జీ ప్లస్‌ త్రీ విధానంలో భవన నిర్మాణం జరిగింది. లోయర్‌ గ్రౌండ్‌, గ్రౌండ్‌, మొదటి, రెండు, మూడు అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులతో భవనాన్ని నిర్మించారు. 2, 3 అంతస్తుల్లో ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందుకు 18 గదులతో పాటు రెండు ప్రత్యేక సూట్‌ రూమ్‌లు నిర్మించారు.

సూట్‌ రూమ్‌లో పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బస చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. కాగా.. ఈ కార్యక్రమాన్ని కవరేజ్‌ చేయడానికి వచ్చిన విూడియాకు మాత్రం బీఆర్‌ఎస్‌ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వలేదు. అధికారుల ఆదేశాల మేరకు విూడియాను బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌ ముందు నుంచి పోలీసులు బయటకు పంపించివేశారు. పార్టీ  కార్యాలయ ప్రాంగణంలో కూడా విూడియా వాళ్ళు ఎవరూ ఉండవద్దంటూ హుకుం జారీ చేశారు. పైనుంచి ఆదేశాలు వచ్చాయని... అందుకోసమే విూడియాకు నో ఎంట్రీ అని ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది చెబుతోంది.