ముందస్తు ముచ్చట ఇక లేనట్లేనా? ఊహాగానాలకు నడ్డా బ్రేక్ ?
Published on: Tue Jun 7, 2022 10:32AM
ఆంధ్రప్రదేశ్'లో పేరుకు ఓ అరడజనుకు పైగా పార్టీలు ఉండ వచ్చును.అందులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, సుదీర్ఘ కాలం పాటు, దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సహా ఐదారు జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఇవిగాక సినిమా గ్లామర్ 'తో ఉనికిని కాపాడుకుంటున్న పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన వంటి ప్రచార అర్భాటం చూపే, కోక డాబు పార్టీలు ఉన్నాయి. అయితే, ఎన్ని పార్టీలు ఉన్నా, ఏపీ రాజకీయాలను శాసించేది వైసీపీ, టీడీపీ పార్టీలు మాత్రమే.
అయితే ఇతర పార్టీలు ఎన్నికల రాజకీయాలను అసలే ప్రభావితం చేసే పరిస్థితిలో లేవా అంటే లేవని కాదు, కానీ, తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకడు, బుచ్చయ్య చౌదరి చెప్పినట్లుగా, బీజేపీ,జనసేన సహా మిగిలిన పార్టీలు, నాలుగు గింజల పాత్ర తప్ప, సొంతంగా జెండా ఎగరేసే సత్తా, సామర్ధ్యం ఏ పార్టీకి లేదని ఎవరికి ఎవరూ చెప్పవలసిన అవసేరం లేదు.అది అందరికీ తెలిసిన రహస్యం.
అయితే, ఇప్పటికిప్పుడు, కాదంటే మరో రెండేళ్ళ తర్వాత ఎప్పుడు ఎన్నికలు జరిగినా, పరిస్థితి ఇలాగే ఉంటుందా అంటే, రాజకీయాలు నిశ్చలన చిత్రాలు కాదు, వేగంగా మారి పోయే చలన చిత్రాలు, కాబట్టి రెండేళ్ళ తర్వాతంటే, అదేమో కానీ, ఇప్పటి కిప్పుడు ‘ముందస్తు’ ఎన్నికలు జరిగితే తెలుగు దేశం, వైసీపీల మధ్యనే పోటీ ఉంటుంది. అందులో సందేహం లేదు. కానీ, అదే, ప్రస్తుత శాసనసభ ఐదేళ్ళ గడవు పూర్తి చేసుకున్నతర్వాత రెండేళ్ళ తర్వాత ఎన్నికలు వస్తే, ప్రధాన పోటీ ఆ రెండు పార్టీల మధ్యనే ఉండవచ్చును. ఉండకపోనూ వచ్చును, అంటున్నారు. రాజకీయాల్లో రెండు సంవత్సరాలు అంటే తక్కువ కాలం కాదు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అయ్యేందుకు ఇంతకంటే ఎక్కువ సమయం అవసరం ఉండదు.
అదలా ఉంటే, ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు పోతారని లెక్కలు వేసిన విశ్లేశకులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజుల రాష్ట్ర పర్యటన తర్వాత, ముందస్తు అవకశాలు సన్నగిల్లాయని అంటున్నారు. నడ్డా తమ పర్యటనలో ఎక్కడ కూడా ముందస్తు ఎన్నికల ప్రస్తావన చేయలేదు. అంతే కాదు, పొత్తుల విషయాన్ని కూడా ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. అందుకు ఇంకా చాల సమయం ఉందని స్పష్టం చేశారు.అంటే, ముందస్తు ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని బీజేపీ అధ్యక్షుడుచెప్పకనే చెప్పారు. మరోవంక రాష్ట్రంలో సొంత బలం పెంచుకునేందుకు బీజీపీ, అడుగులు వేస్తోంది. సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. నడ్డా రాష్ట్ర పర్యటన ప్రధాన ఉద్దేశం కూడా అదే అని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు పోదామని ముచ్చట పడినా, కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతుందని పరిశీలకులు అంటున్నారు. ఇంతవరకు దక్షిణాది రాష్ట్రాలపై మరీ ముఖ్యంగా ఏపీపై అంతగా దృష్టి పెట్టని బీజేపీ, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిని కేంద్రీకరించింది. అంతే కాకుండా ఏపీ ఇరుగు పొరుగు రాష్ట్రాలు, తమిళనాడు, తెలంగాణలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఆ రెండు రాష్ట్రాలలో కొంత సానుకూల వాతావరణం కనిపిస్తోంది. మరోవంక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనమై, ప్రాంతీయ పార్టీలదే పై చేయి అయిన నేపధ్యంలో, దక్షిణాదిలో పాగా వేసేందుకు ఇదే సరైన సమయంగా బీజీపీ భావిస్తోందని, అందుకే, ఎపీలోనూ ఎంతో కొంత పొలిటికల్ సస్పేస్ సొంత చేసుకునే ఉద్దేశంతో అడుగులు వేస్తోంది.
ఈ పరిస్థితిలో, రాష్ట్రంలో బీజేపీ ళ్లూనే వరకు ఎన్నికల ప్రస్తావన రానీయదని, అందుకే బీజేపీ, జనసేన కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధి విషయంలో అటో ఇటో తేల్చేయాలని జనసేన నాయకులూ వరస పెట్టి ప్రకటనలు గుప్పించినా, హెచ్చరికలు చేసినానడ్డా అసలు ఆ విషయమే పట్టించుకోలేదని అంటున్నారు. అదలా ఉంటే, ఓ వంక వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ట దినదిన ప్రవర్థమానంగా దిగజారి పోతున్నది. ప్రభుత్వ వ్యతిరేకత పైపైకి పరుగులు తీస్తోంది.
ఈ నేపధ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగు దేశం పార్టీ సునాయాసంగా జెండా ఎగరేస్తుంది.అందులో ఎవరికీ సందేహం లేదు. మహానాడు తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారి పోయిన నేపద్యంలో, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, టీడీపీ గెలుపును ఎవరూ అపలేరు అన్న విషయం స్పష్టమైంది. అలాగే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా, ఒంటిరిగా పోటీ చేసినా బీజేపీకి వచ్చే ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదు... అలాగే , ముందస్తు ఎన్నికలు ఓటమి అంచున వేళ్ళాడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని, బెయిల్ అవుట్ చేసే, రక్షించే పరిస్థితి కనిపించడం లేదు, సో ... వైసీపీ కూడా ముందస్తు అలోచనని వెనక్కి తీసుకుందని అంటున్నారు. అందుకే, ముందస్తు ఊహాగానాలకు నడ్డా బ్రేకు వేశారా, అంటే రాజకీయ పండితులు అంతేగా’ అంటున్నారు.


