గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాలకు బడ్జెట్ నిల్!
Published on: Mon Jul 25, 2022 6:36AM
అరి చేతిలో వైకుంఠం చూపించేసి చివరకు అరిటాకులో చద్దన్నం పెట్టారన్నది ఓ నానుడు. జగన్ సర్కార్ పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చేసి.. ఇప్పుడు వాటి అమలు చేయలేక కోతలు, వడ్డింపులు, బాదుడు అంటూ జనం నెత్తిన బండ పడేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మానస పుత్రికగా చెప్పుకుంటున్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఒక త్రిశంకు స్వర్గం అని తేలిపోయింది.
ఆయా సచివాలయాల ఉద్యోగులకు వేతనాలకు బడ్జెట్ లేదని స్వయంగా ప్రభుత్వమే చెప్పకుండానే చెప్పేసింది. అంటే ఏన్నో వడపోతల తరువాత, ఆందోళనల తరువాత ప్రబేషన్ పొందినా వారికి పెరిగిన వేతనాలు వచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది. ప్రొబేషన్ కోసమే రోడ్డెక్కిన సచివాలయాల ఉద్యోగులు పూర్తిగా విజయం సాధించలేదు. దాదాపు 60 వేల మందికి ప్రభుత్వం ప్రొబేషన్ ఇవ్వలేదు. పోనీ ఇచ్చిన వారికైనా పెరిగిన వేతనాలు ఇస్తుందా అంటే అదీ లేదని ఇప్పుడు చెబుతున్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని గొప్పగా చెప్పుకునే జగన్.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యగోలు విషయంలో ప్రతి సారీ మాట తప్పుతున్నారు.. మడమ తిప్పుతున్నారు. సచివాలయాల ఉద్యోగులు దాదాపు రెండున్నరేళ్లకు పైగా కేవలం 15 వేల రూపాయల వేతనానికి ఉద్యోగాలు చేస్తున్నారు.
ప్రొబేషన్ విషయంలోనూ వారు నానా ఇబ్బందులూ పడ్డారు. పరీక్ష రాసి అందులో అర్హత సంపాదించి ఉద్యోగం సాధించుకున్న వారిని ప్రొబేషన్ కోసం మళ్లీ పరీక్ష అన్నారు. తొలుత ఉద్యోగాలు ఇచ్చే సమయంలో మాత్రం ప్రొబేషన్ కు మళ్లీ ఎటువంటి పరీక్షలూ అవసరం లేదనీ, ఆటో మేటిగ్గా వచ్చేస్తుందని ప్రకటించిన జగన్.. రెండున్నరేళ్ల తరువాత పరీక్ష రాసి అర్హత సాధించుకోవాలన్నారు. అలా కొత్త నిబంధనతో దాదాపు 60 వేల మందిని ప్రొబేషన్ కు అనర్హులుగా ప్రకటించారు. పోనీ అర్హులంటూ ప్రొబేషన్ ఇచ్చిన వారికైనా ప్రభుత్వం ప్రకటించిన విధంగా పెరిగిన వేతనాలు ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఎందుకంటే అందుకు బడ్జెట్ లేదట.
ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని గుర్తించడానికి నిబంధనలు అంగీకరించవట. ఈ నెల నుంచి కొత్త వేతనాలు అందుకుంటామని ఎదురు చూస్తున్న సచివాలయాల ఉద్యోగులకు ట్రెజరీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఇది. ఆ కారణంగా ఈ నెల కూడా గతంలోలా 15 వేల రూపాయల వేతనం మాత్రమే వస్తుందని ట్రెజరీ వర్గాలు సచివాలయాల ఉద్యోగులకు సమాచారం అందించాయి.ముందు మందు నిబంధనలన్నీ పూర్తి చేసి అరియర్స్ తో సహా వేతనాలిస్తామని ప్రభుత్వ వర్గాలు సచివాలయాల ఉద్యోగులకు చెబుతున్నాయి.


