TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ బండారం బయటపెట్టిన నిడదవోలు క్లాత్ మర్చంట్స్

Published on: Sat Oct 15, 2022 12:10PM

రైతుల మహా పాదయాత్రకు వ్యతిరేకంగా ఆ పాదయాత్ర మార్గంలో వెలుస్తున్న ఫ్లెక్సీల గుట్టు రట్టయ్యింది. వివిధ సంఘాలు, వ్యక్తుల పేర్లతో వైసీపీ ఏర్పాటు చేస్తున్న ఆ ఫ్లెక్సీల లోగుట్టును  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వెలిసిన ఓ పోస్టర్ వైసీపీ చేస్తున్న దుష్ట రాజకీయాన్ని ఎలుగెత్తి చాటింది. రైతుల మహాపాదయాత్రకు వ్యతిరేకంగా నిడదవోలులో క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ పేరుతో పోస్టర్లు వెలిశాయి.
ఆ పోస్టర్లలో వైసీపీ ఎమ్మెల్లే శ్రీనివాసనాయుడి ఫోటో పెద్దగా ఉంది. అయితే ఆ పోస్టర్ వెలసిన వెంటనే క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ వారు ఎమ్మెల్యేను కలిసి తమకు కనీస సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా ఇలా ఫ్లెక్సీలు వేయడం సరికాదని ఆయనకు చెప్పారు. వాటిని వెంటనే తొలగించేయాలనీ కోరారు. అయితే ఎమ్మెల్యే మాత్రం.. మీకు ఏం కాదు.. వాటి సంగతి నేను చూసుకుంటానంటూ సర్ది చెప్పి పంపించేశారు. అయితే క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ వారు మాత్రం ఎమ్మెల్యే సమాధానంతో సమాధాన పడలేకపోయారు. దీంతో వారే రైతులు, ప్రజలకు విజ్ణప్తి చేస్తూ మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

ఆ ఫ్లెక్సీపై గత ఫ్లెక్సీతో తమకేమీ సంబంధం లేదనీ, వాటిని ఎవరు ఏర్పాటు చేశారో, ఎందుకు చేశారో అన్న విషయంపై తాము చర్చించదలచుకోలేదనీ, వారి విజ్ణతకే వదిలేస్తున్నామనీ పేర్కొన్నారు. దీంతో రైతుల మహాపాదయాత్ర మార్గంలో  ఆ పాదయాత్రను వ్యతిరేకిస్తూ వెలుస్తున్న ఫ్లెక్సీలు, నిరసనల లోగుట్టు ఏమిటన్నది అందరికీ బోధపడిపోయింది. వైసీపీ వారే కుట్ర పూరితంగా సంఘాలు, సంస్థల   అనుమతితో సంబంధం లేకుండా వారి, వాటి పేర్లతో రైతులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని నిడదవోలు క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ వారు తాజాగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తో తేటతెల్లమైపోయింది.

వైసీపీ బండారం బయటపడిపోయింది. ఇక వికేంద్రీకరణకు అనుకూలంగా విశాఖలో తలపెట్టిన ర్యాలీకి డ్వాక్రా మహిళలను తీసుకురావడానికి మొత్తం అధికార యంత్రాంగాన్నే నియోగించిన తీరు వైసీపీ ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నది తేటతెల్లం చేసింది.