TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వివేకా హత్య కేసులో కొత్త మలుపు...

Published on: Mon Mar 28, 2022 11:06AM

మాజీ మంత్రి  వైఎస్ వివేకా హత్య కేసు చివరి దశకు చేరుకుంది. అయితే, ఇంకా ఇప్పటికీ, అసలు హంతకులు ఎవరు? అనే విషయంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటు కుటుంబ సభ్యులు, అటు రాజకీయ నాయకులు, అసలు దోషులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో, వైసీపీ రెబెల్ ఎంపీ, రఘురామ కృష్ణరాజు సీబీఐ చీఫ్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ కు రాసిన లేఖ సంచలనంగా మారింది.  

రఘురామ కృష్ణం రాజు, తమ లేఖలో దర్యాప్తును వేగవంతం చేయాలని కోరడంతో పాటుగా, ఈ కేసులో నిందితులు ఒకరైతే వారి వెనుక మాస్టర్ మైండ్’ మరొకరు ఉన్నారని పేర్కొన్నారు. అలాగే, ఇంతవరకు సీబీఐ విచారించని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డిని కూడా విచారించాలని లేఖలో కోరారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన కొద్దిసేపటికే విజయసాయి రెడ్డి, వివేకానంద రెడ్డి హార్ట్ ఎటాక్’తో చనిపోయారని ప్రకటించిన విషయాన్ని లేఖలో పేర్కొన్నరు. ఈ నేపధ్యంలో విజయసాయి రెడ్డిని విచారించాలని,రఘురామ కృష్ణం రాజు సీబీఐ  చీఫ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.  అంతే కాదు  తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు పరిటాల రవి హత్య కేసు మాదిరిగానే ఇందులో కూడా నిందుతులు, కీలక సాక్ష్యులను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు.జైలు లోపలా బయట ఉన్న వారికి రక్షణ కల్పించాలన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తుకు భంగం కలిగించే కుట్ర జరుగుతోందని, రఘురామ కృష్ణం రాజు అనుమానం వ్యక్త పరిచారు.  

రఘురామ కృష్ణం రాజు తమ లేఖలో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర శాసనసభలో, వివేకాహత్య కేసులో అనుమానితునిగా విచారణ ఎదుర్కుంటున్న, వైసీపీ ఎంపీ, ముఖ్యమంత్రి కజిన్ బ్రదర్’ అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారని పేర్కొన్నారు. సీబీఐ విచారణ  జరుగుతున్నా సమయంలో ముఖ్యమంత్రి శాసనసభలో ఈ విధమైన ప్రకటన చేయడం సముచితంకాదని, నిబంధనలకు విరుద్దమని కృష్ణం రాకు లేఖలో పేర్కొన్నారు. 

అదలా ఉంటే వివేకా హత్య కేసు విచారణ తుది దశకు వచ్చిందని అనుకుంటున్న సమయంలో రఘురామ సీబీఐకి లేఖరాయడం, అందులో  విజయసాయిని విచారించాలని కోరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతే కాకుండా ఈ లేఖకు పుర్వరంగంలో ఇటీవల రఘురామరాజు రూ.1,100 కోట్ల ఆర్థిక నేరానికి పాల్పడ్డారంటూ విజయసాయి రెడ్డి సీబీఐకి లేఖరాశారు. ఈ నేపధ్యంలో, ఆ లేఖకు ఈ లేఖ కౌంటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇప్పటికే అనేక కోణాల్లో విచారణ జరపడంతో పాటుగా, అనేఅక మంది వాగ్మూలను నమోదు చేసిన సీబీఐ, ఎలా స్పందిస్తుందో వేచి చూడాలని అంటున్నారు.