అదరహో అసెంబ్లీ
posted on Jul 27, 2018 5:45PM
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నూతన అసెంబ్లీ కోసం టవర్ ఆకృతిలో ఉన్న డిజైన్ను నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించింది. శాశ్వత అసెంబ్లీ డిజైన్లపై నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఆవరణలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, సిబ్బందికి కావాల్సిన వసతులపై వారితో చర్చించారు.
పూర్తిస్థాయి ఆకృతులపై పలు మార్పులు సూచించారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందం, ఆకర్షణే కాకుండా భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఐదు అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మాణం జరుగనున్నట్లు వెల్లడించారు. సెల్లార్లో సర్వీసులు, మొదటి అంతస్తులో అసెంబ్లీ, కౌన్సిల్ హాల్, రెండో అంతస్తులో మంత్రుల లాంజ్లు, మూడో అంతస్తులో ప్రభుత్వ కార్యకలాపాలు కోసం నిర్మాణం జరగనున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ జరగని సమయంలో పర్యాటకులకు అనుమతి ఉంటుందన్నారు. 250 మీటర్ల ఎత్తులో టవర్ వస్తుందని, లిఫ్ట్ల ద్వారా టవర్ పైకి వెళ్లి నగర అందాలు వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఆగస్టు నెలాఖరుకు తుది ఆకృతులు సిద్ధమవుతాయన్నారు.