TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తేదీ 11.. ఎమ్మెల్యేలు 11.. సమయం 11 నిముషాలు!

Published on: Wed Feb 11, 2026 1:57PM

వైసీపీని 11 నంబర్ వదల నంటున్నది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. అప్పటి నుంచీ ఆ నంబర్ వింటేనే  ఆ పార్టీ ఉలిక్కిపడుతోంది. 151 టు 11 గా ఆ పార్టీ తిరోగమన ప్రస్థానాన్ని నెటిజనులు అప్పట్లో ఓ ఆట ఆడుకున్నారు. జగన్ ప్రతిపక్ష హోదా అంటూ డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి గైర్హజర్ కావడాన్ని కూడా 11 అంకెను ప్రస్తావిస్తూ నెటిజనులు ఇప్పటికే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అది పక్కన పెడితే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా 11వ తేదీనే ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు జగన్ తన బాయ్ కాట్ ను పక్కన పెట్టి తనతో సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశాలకు హాజరయ్యారు. అవ్వడం కాదు.. ఆ 11 మందీ సభలో సరిగ్గా 11 నిముషాల పాటు ఉన్నారు. దీంతో మరోసారి జగన్ ను, వైసీపీని ఈ 11 నంబర్ తో నెటిజనులు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఓ ఆటాడుకుంటున్నారు.  

నిజానికి తాను తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరౌతానంటూ జగన్ ప్రకటించిన తరువాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు  సెటైరికల్ గా వారు 11 నిముషాలకు మించి సభలో ఉండరు అని జోక్ కూడా చేశారు. సరిగ్గా ఆయన అన్నట్లుగానే జగన్ తన 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చి సరిగ్గా 11 నిముషాల సేపు సభలో ఉండి కొన్ని నినాదాలు చేసి వాకౌట్ చేశారు. వైసీపీ అధినేత జగన్, పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వాకౌట్ చేయడం అన్నది.. తమ శాసనసభ సభ్యత్వాలను కాపాడుకోవడానికి రిజిస్టర్ లో సంతకం చేయడానికేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
అది పక్కన పెడితే 11 నంబర్ తో జగన్ ను నెటిజనులు చేస్తున్న ట్రోలింగ్ తో ఆయనకు పదకొండు సంఖ్య అంటేనే వణికిపోయే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఆ సంఖ్య కనిపించినా, వినిపించినా భరించ లేకపోతున్నారని అంటున్నారు.  ఇక ప్రస్తుత బడ్జెట్ సమావేశాలకు వస్తే.. ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమౌతాయని నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచీ వైసీపీని నెటిజనులు ట్రోలింగ్ తో తెగ టీజ్ చేస్తున్నారు.

మళ్లీ వచ్చింది 11 అంటూ ఎద్దేవా చేశారు. అక్కడితో ఆగకుండా.. సభా సంప్రదాయలను ఒకింత పక్కన పెట్టి బుధవారం (ఫిబ్రవరి 11) అంటే 11 తేదీనే గవర్నర్ ప్రసంగం పూర్తికాగానే ప్రభుత్వం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టాలంటూ చిలిపిగా ప్రభుత్వానికి సూచనలు చేసి జగన్ ను వేరే రేంజ్ లో ట్రోల్ చేశారు. ఇక బడ్జెట్ సమావేశాలు మార్చి 7  వరకూ జరగనున్నాయి. అంటే పక్షం రోజులకు పైగానే.. మరి ఇప్పుడు జగన్ సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలూ సభకు వచ్చి తమ వాణిని వినిపిస్తారా? బడ్జెట్ పై చర్చలో పాల్గొంటారా? అన్నది రానున్న రోజులలో తేలుతుంది.