TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దాడుల దారి దాడులదే.. చర్చల దారి చర్చలదే.. కుండబద్దలు కొట్టిన నెతన్యాహు

Published on: Fri Apr 10, 2026 11:28AM

మిడిల్ ఈస్ట్ లో శాంతి అవసరమే అంటున్న ఇజ్రాయెల్ లెబనాన్ తో చర్చలకు సిద్ధమని ప్రకటించి ఒక అడుగు ముందుకు వేసింది. అయితే దాడుల దారి దాడులదే.. శాంతి చర్చల దారి శాంతి చర్చలదే అంటూ మెలికపెట్టింది.  లెబనాన్ తో కాల్పుల విరమణ ఉండదు కానీ, అందు కోసం ఆ దేశంతో చర్చించడానికి రెడీ అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి  బెన్యామిన్ నెతన్యాహు అంటున్నారు.   అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే నెతన్యాహు ఒక అడుగు దిగి వచ్చారని అంటున్నారు. అదే సమయంలో పైచేయి మాదేనని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని చెబుతున్నారు.  

ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.  అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి కారణంగా దాడుల విరమణకు, శాంతి చర్చలకు నెతన్యాహు అంగీకరించారు. అయితే ఆ చర్చలు విజయవంతమయ్యే వరకూ లెబనాన్ పై దాడులను ఆపే ప్రశక్తే లేదన్న మెలిక పెట్టారు. అంటే లెబనాన్ తో చర్చలు ఫలవంతం అయిన తరువాతనే ఇజ్రాయెల్ దాడులను విరమిస్తుందని చెబుతున్నారు. అయితే ఇజ్రాయెల్ విధించిన ఈ షరతు లేదా నిబంధనకు లెబనాన్, హిజ్బుల్లా ఏ మేరకు అంగీకరిస్తాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో తీసుకు వచ్చిన ఒత్తిడి కారణంగానే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒకింత మెత్తబడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఒకవేళ ఈ ఒప్పందం సజావుగా సాగితే శాంతి నెలకొనే అవకాశాలున్నాయన్న ఆశాభావం వ్యక్తం అవుతున్నది.  మొత్తం మీద నెతన్యాహు ఒకింత వెనక్కు తగ్గడం మిడిల్ ఈస్ట్ లో శాంతి స్థాపనకు పడిన ఒక ముందడుగుగా అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో?