నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. జీపు లోయలో పడి 17 మంది మృతి
Published on: Fri May 1, 2026 9:33AM
.webp)
నేపాల్లోని రోల్పా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ జీపు కొండ మార్గంలో అదుపుతప్పి సుమారు 800 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎంత మంది ఉన్నారన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రయాణికులు వైశాఖ పూర్ణిమ వేడుకల కోసం జల్జలా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. థవాంగ్ మున్సిపాలిటీ పరిధిలోని జల్జలా వద్ద బురదతో కూడిన ఇరుకైన రోడ్డుపై జీపు ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా వాహనం జారిపోయి లోయలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా రహదారి జారుడుగా మారడమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే, వర్షం విపరీతంగా కురుస్తుండటం, లోయ అత్యంత లోతుగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. నేపాల్లోని కొండ ప్రాంతాల్లో రహదారులు సక్రమంగా లేకపోవడం, వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటి కారణాల వల్ల తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వారం కూడా ప్యుఠాన్ జిల్లాలో జరిగిన ఇటువంటి ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.


