నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలది జీరో పెర్ఫార్మెన్స్!
Published on: Thu Jun 9, 2022 1:03PM
గడప గడపకూ కార్యక్రమంలో వైసీపీ ప్రజా ప్రతినిథులు నిరసన సెగలను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినా అధినేత ఆదేశం కదా అని ఆపసోపాలు పడుతూ ప్రజా నిరసన సెగను తట్టుకుంటూ అతి కష్టం మీద ఆ కార్యక్రమాన్ని నెట్టుకోస్తుంటే.. పులి మీద పుట్రలా సీఎం జగన్ జిల్లాల వారీగా గడపగడపకూ కార్యక్రమంపై సమీక్షలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేల ఫెర్మార్సెన్స్ ను నిర్ణయిస్తున్నారు.
ఇందులో భాగంగా బుధవారం సమీక్షను నిర్వహించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమీక్ష జరిగింది. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ చార్జీలు హాజరయ్యారు. ఈ సమీక్షకు ముందే గడపగడపకూ కార్యక్రమంలో ప్రజాప్రతినిథుల భాగస్వామ్యంపై జగన్ జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. సమీక్షలు ఆయనా నివేదికల ఆధారంగా ప్రజా ప్రతినిథుల పెర్ఫార్మెన్స్ కు మార్కులు వేశారు. ఇందులో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ జీరో అని సీఎం జగన్ డిక్లేర్ చేశారు.
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ లు ఇప్పటి వరకూ గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొననే లేదు. వీరు కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, నంద్యాల జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిలు కూడా జీరో పెర్ఫార్మెన్స్ జాబితాలో ఉన్నారు.
జీరో పెర్ఫార్మెన్స్ జాబితాలో నెల్లూరుకే చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటంపై జగన్ ఫైర్ అయినట్లు సమాచారం. అలాగే జగన్ కేబినెట్ లో మంత్రులుగా పని చేసి ఉద్వాసనకు గురైన ఇద్దరు మంత్రులు సైతం ఈ జాబితాలో ఉండటం గమనార్హం.


