వినాయక నిమజ్జనం ఊరేగింపులో పేలుడు
Published on: Fri Aug 29, 2025 8:27PM
.webp)
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అప్పసముద్ర గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఘోర ప్రమాదం జరిగింది. నిమజ్జనోత్సవంలో భాగంగా ట్రాక్టర్లో తీసుకెళ్తున్న వినాయక విగ్రహంతో పాటు టపాసులు ఒక్కసారిగా పేలడంతో పదిమంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, అప్పసముద్ర గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు ఘనంగా జరుగుతోంది. ఈ ఊరేగింపులో ఒక ట్రాక్టర్లో వినాయక విగ్రహాన్ని, మరో ట్రాక్టర్లో బాణాసంచాను ఉంచి తీసుకువెళ్తున్నారు.
ఊరేగింపులో జరుపుతున్న బాణాసంచా ట్రాక్టర్లో ఉన్న టపాసులపై పడటంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న పదిమంది చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారి ఆర్తనాదాలతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన చిన్నారులను వింజమూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స జరుగుతోంది. ఈ ఘటనతో గ్రామంలోని బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


