TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీహార్ లో ఎన్డీయే హవా

Published on: Fri Nov 14, 2025 1:41PM

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. అయితే ట్రెండ్స్ ను బట్టి ఈ ఎన్నికలలో ఘన విజయంతో ఎన్డీయే రాష్ట్రంలో మరో సారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయంగా తేలిపోయింది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఆధిక్యతల ప్రకారం ఎన్డీయే కూటమి అభ్యర్థులు 191 స్థానాలలో ముందంజలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్   49 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబరుస్తోంది.ఎన్డీయే కూటమిలో బీజేపీ  84 స్థానాల్లోనూ, జేడీయూ 80 స్థానాల్లో  ముందంజలో ఉన్నాయి.  

శుక్రవారం(నవంబర్ 14) ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ ఎన్డీయే కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఎన్డీయే మెజారిటీ స్థానాలలో ఆధిక్యత ప్రదర్శిస్తున్నది.  

కాగా ఈ ట్రెండ్ చూస్తుంటే ఏదో అనుమానం కలుగుతోందని సీపీఐ నాయకుడు రాజా అన్నారు. ప్రచారంలో మహాఘట్ బంధన్, తేజస్వీ యాదవ్ ల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. 

ఇక కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ బీహార్ ఫలితాలను చూసిన తరువాతైనా పార్టీలో ఆత్మపరిశీలన జరగాల్సి ఉందని వ్యాఖ్యానించారు. కేవలం ఆత్మపరిశీలన చేసుకుంటే సరిపోదనీ, కూర్చుని ఆలోచించాలనీ, ఎం తప్పు జరిగింది? ఎక్కడ జరిగింది అన్న విషయాలపై పార్టీలో విస్తృత చర్చ జరగాలని, వ్యూహాత్మక, సంస్థాగల తప్పులు ఏమిటన్నదానిపై అధ్యయనం జరగాలని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.  

ఇక బీహార్ ఎన్నికలలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన జన సురాజ్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఈ పార్టీ మొత్తం స్థానాలలో పోటీ చేసినా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా విఫలమయ్యాయి.