TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలోనూ ఎన్డీయే ప్రభుత్వం.. మోడీ వ్యూహం ఇదే!

Published on: Tue May 12, 2026 12:55PM

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే  కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు.

తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన..  ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.   గతంలో బీజేపీ,తెలుగుదేశం మధ్య విభేదాలు ఉన్నాయంటూ సాగిన ప్రచారానికి ఈ భేటీలతో ఫుల్ స్టాప్ పడింది. ముఖ్యంగా ఏపీలో కూటమి విజయం తర్వాత, ఇప్పుడు ఆ ప్రభావం తెలంగాణపై కూడా పడబోతోందని స్పష్టమవుతోంది. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా కాకుండా..  మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేనలను కలుపుకొని ఎన్డీయే కూటమిగా ముందుకు సాగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాసాలకు స్వయంగా వెళ్లడమే ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.  

2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ, పార్లమెంట్ ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయింది. ఎన్డీయే కూటమి పొత్తు అధికారికంగా లేకపోయినా..  టీడీపీ కేడర్ మద్దతు బీజేపీకి లభించడం వల్ల అక్కడ ఆ పార్టీకి ఎంపీ సీట్లు పెరిగాయని ఆయన విశ్లేషించారు.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీకి ఇప్పటికీ గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓట్లను తమ వైపు తిప్పుకోవాలంటే కూటమిగా వెళ్లడమే శ్రేయస్కరమని ప్రధాని మోదీ భావిస్తున్నారని అడుసుమిల్లి చెప్పారు. 

చంద్రబాబు నాయుడు, మోదీల మధ్య ఉన్న అనుబంధం కేవలం రాజకీయ అవసరాల కోసమే కాకుండా..  రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా సాగుతోందని తెలుస్తోంది. కేంద్రం నుంచి అందుతున్న సహకారం..  పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు నిధుల విడుదల వంటివి రెండు పార్టీల మధ్య స్నేహాన్ని మరింత బలపరిచాయి. తెలంగాణలో కూడా ఒక సరైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసి..  కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తే ఎన్డీయే కూటమి ఇక్కడ బలమైన శక్తిగా ఎదుగుతుందని అడుసుమిల్లి విశ్లేషించారు.