TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహానాడులకు వారం... దీక్షలకు మరో వారం... వెలవెలబోతున్న సచివాలయం

Published on: Tue Jun 6, 2017 2:40PM

ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోన్న నవనిర్మాణ దీక్షలకు ప్రజల నుంచి మద్దతు అంతంతమాత్రంగానే ఉంది. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో చంద్రబాబు దీక్షా శిబిరం ప్రారంభించిన మొదటిరోజే జనం లేక వెలవెలబోగా.... ఆ తర్వాత కూడా అదే పరిస్థితి. అయితే జనం ఉన్నా లేకున్నా చంద్రబాబు మాత్రం తన స్టైల్లో స్పీచ్‌లిచ్చుకుంటూ పోతున్నారు. ఇక ఈ మూడేళ్ల ప్రగతిపై నిర్వహిస్తోన్న చర్చాగోష్టిలకు టీచర్లు, ఉద్యోగులను బలవంతంగా తరలిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. అయితే వచ్చినవాళ్లు సభ ప్రారంభం కాకముందే వెనుదిరుగుతున్నారు. దాంతో సీట్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎవరున్నా లేకపోయినా తాను చెప్పదల్చుకున్నది చెప్పేసి వెళ్లిపోతున్నారు.

 

మరోవైపు నవనిర్మాణ దీక్షల్లో తప్పనిసరిగా పాల్గోవాలని మంత్రులను సీఎం ఆదేశించడంతో.... అమాత్యులంతా జిల్లాలకే పరిమితమైపోయారు. దాంతో రెండు వారాలుగా మంత్రులు సచివాలయం వైపు రావడమే మానేశారు. ఒకరిద్దరు మంత్రులు మినహా ఎవరూ సెక్రటేరియట్‌ గడప తొక్కడం లేదు. మినీ మహానాడులు, మహానాడుకు వారంరోజులు... నవనిర్మాణ దీక్షలకు మరో వారం రోజులు కేటాయించడంతో మంత్రులందరూ జిల్లాలకే పరిమితమయ్యారు. మంత్రుల రాకపోవడంతో... ఉన్నతాధికారులు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఇక కిందిస్థాయి సిబ్బంది హాజరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. దాంతో రెండు వారాలుగా సచివాలయంలో పాలన కుంటుపడింది. 

 

మరోవైపు ప్రతి సోమ, గురువారాల్లో మంత్రులు తప్పనిసరిగా సెక్రటేరియట్‌లో అందుబాటులో ఉండాలన్న సీఎం ఆదేశాలను ఎక్కువమంది మంత్రులు పట్టించుకోవడం లేదు. ఇక మినీ మహానాడులు, మహానాడుకు వారంరోజులు... నవనిర్మాణ దీక్షలకు మరో వారం రోజులు కేటాయించడంతో సచివాలయం వెలవెలబోతోంది. దీక్షల పేరుతో మంత్రులంతా జిల్లాల్లోనే ఉండటం.... ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నవనిర్మాణ దీక్షా కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో సచివాలయంలో పాలన పడకేసింది. పైగా నవనిర్మాణ దీక్షల పేరిట ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కోట్లు వెచ్చించినా దీక్షలకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంపై జోకులు పేలుతున్నాయి.