TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాసిక్ టీసీఎస్ కేసు.. నిందితురాలు నిదాఖాన్ కు మలేసియా లింకులు

Published on: Tue Apr 28, 2026 9:13AM

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్ లో ఇటీవల చోటుచేసుకున్న మత మార్పిడి ఆరోపణల వ్యవహారంలో అంతర్జాతీయ లింకులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.  నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో  సాగుతున్నట్లు భావిస్తున్న మత మార్పిడి, వేధింపుల  కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్‌కు అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని ప్రాసిక్యూటర్లు కోర్టుకు వెల్లడించడం సంచలనం సృష్టించింది. నిందితులు ఒక మహిళా ఉద్యోగిని మతం మార్చడమే కాకుండా, ఆమెకు 'హానియా' అనే పేరు మార్చి, ఉద్యోగం కోసం మలేషియాకు పంపేందుకు సిద్ధమైనట్లు పోలీసు విచారణలో తేలింది.

సోమవారం ( ఏప్రిల్ 27న )జరిగిన కోర్టు విచారణలో   నిందితులు బాధితురాలి విద్యా ధృవపత్రాలను మరియు ఇతర ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారని, వాటిని మలేగావ్‌లోని ఒక బృందానికి అందించేందుకు ప్లాన్ చేశారనీ, నిదా ఖాన్ బాధితురాలికి ఇస్లామిక్ సాంప్రదాయాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు, ఆమె ఫోన్‌లో మతపరమైన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసిందని ప్రాసిక్యూషన్ పేర్కొంది. ప్రస్తుతం నిదా ఖాన్ పరారీలో ఉండగా, ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను మే 2కు వాయిదా వేసింది.

ఈ వ్యవహారం కేవలం ఒక కార్యాలయ వివాదంగానే కాకుండా, జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా మారుతోంది. వ్యవస్థీకృత మత మార్పిడులను  ఉగ్రవాద చర్యగా గుర్తించాలంటూ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు UAPA చట్టాల కింద ఇలాంటి కార్యకలాపాలను చేర్చాలని పిటిషనర్ కోరారు. నాసిక్ ఘటన దేశవ్యాప్తంగా పౌరుల మనోభావాలను దెబ్బతీసిందని, దీని వెనుక విదేశీ నిధుల హస్తం ఉండే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, టీసీఎస్ యాజమాన్యం కూడా ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరిస్తోంది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఆరతి సుబ్రమణియన్ నేతృత్వంలో అంతర్గత విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే ఎనిమిది మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన సంస్థ, విచారణకు పూర్తి సహకారం అందిస్తోంది. బాధితుల నుండి 78కి పైగా ఇమెయిల్స్ వచ్చినా సకాలంలో స్పందించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ మేనేజర్ అశ్విని చైనానీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతానికి ఈ కేసులో తొమ్మిది ఎఫ్ఐఆర్లు  నమోదవ్వగా, ఏడుగురిని అరెస్టు చేశారు.  నిందితులను అరెస్ట్ చేశారు..  పరారీలో ఉన్న నిదా ఖాన్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.   ఈ కేసులో వెలుగు చూస్తున్న 'మలేషియా లింక్' మరియు అంతర్జాతీయ కోణం రానున్న రోజుల్లో మరింత రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది.