కేసీఆర్ సర్వే కథేంటి? మోడీ కూపీ...

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే మీద ఎన్నో వివాదాలు చెలరేగిన విషయం, అయినప్పటికీ కేసీఆర్ వెనుకడుగు వేయకుండా సర్వే పూర్తి చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సర్వే వ్యవహారాన్ని గమనిస్తూ వచ్చిందే తప్ప జోక్యం చేసుకోలేదు. కేంద్ర హోంశాఖ ఈ సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారో వివరించండంటూ లేఖ రాసిందని మొదట్లో వదంతులు వచ్చాయి. అయితే వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు కేంద్ర హోంశాఖ కూడా ఖండించింది. అయితే తాజాగా కేసీఆర్ నిర్వహించే సర్వే గురించి ప్రధాని నరేంద్రమోడీ కూపీ లాగినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనలో వున్నారు. ఆయన శుక్రవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి రెండు రాష్ట్రాల్లోని పరిస్థితుల మీద సమగ్ర నివేదిక ఇచ్చారు. ఈ సందర్భంగా నరేంద్రమోడీ సమగ్ర కుటుంబ సర్వే గురించి గవర్నర్‌ని అన్ని విషయాలూ వివరంగా అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. అలాగే ఈ సర్వే గురించి కూడా ప్రధానికి గవర్నర్ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది.