ప్రణాళికా సంఘం రద్దు

 

ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తున్నట్టు భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎర్రకోట నుంచి ప్రసంగించిన నరేంద్రమోడీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త వ్యవస్థను తీసుకురానున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త ఆత్మతో కూడిన వ్యవస్థ దేశానికి అవసరమని, అందుకే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రణాళికా సంఘానికి సుదీర్ఘ చరిత్ర వుంది. 1950లో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రణాళికా సంఘాన్ని స్థాపించారు. కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటైన ప్రణాళికా సంఘానికి అపరిమిత అధికారాలు వుండేవి. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వుండేవారు. సంఘంలో ఉపాధ్యక్షుడి పదవి కూడా కీలకమే. గుల్జారీలాల్‌ నందా, టి.టి.కృష్ణమాచారి, సి.సుబ్రమణ్యం, పి.ఎన్.హక్సార్, మన్మోహన్‌సింగ్, ప్రణబ్‌ముఖర్జీ, కె.సి.పంత్, జశ్వంత్‌సింగ్, మధు దండావతే, మోహన్‌ ధారియా, ఆర్.కె.హెగ్డే తదితరులు ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు.