మోదీ కూడా మన్మోహన్లా అయిపోతున్నారు- తృణమూల్
posted on Feb 27, 2016 11:39AM
తన వాక్పటిమకు పేరొందిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపక్షాల నుంచి ఓ చిత్రమైన విమర్శను ఎదుర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన సుల్తాన్ అహ్మద్ అనే ఎంపీ నిన్న పార్లమెంటులో మాట్లాడుతూ, హర్యానా గురించి మోదీ నిశ్శబ్దంలో ఉండటంలో ఆంతర్యం ఏమిటంటూ ప్రశ్నించారు. మోదీ కూడా నిదానంగా పూర్వ ప్రధాని మన్మోహన్లాగా ‘సైలెన్స్ సిండ్రోమ్’ అనే లక్షణానికి లోనవుతున్నారనీ, అధికారం వేరెవరో చెలాయిస్తున్నారనీ విమర్శించారు. దిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న హర్యానాలో కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరుగుతున్నా మోదీ కిమ్మనకుండా ఉన్నారన్నది సుల్తాన్ అహ్మద్ మాట. నిరుద్యోగం పెరిగిపోవడం వల్ల యువత అసహనానికి లోనవుతున్నారనీ, అందుకే ఇలాంటి ఉద్యమాలు వస్తున్నాయనీ అన్నారు సదరు సభ్యుడు. మోదీ ఈ విమర్శకు జవాబిస్తారో, పోతేపోనీ అని ఊరుకుంటారో చూడాలి మరి!